తెలంగాణ కాంగ్రెస్లో రేగిన ‘మంత్రి కొండా సురేఖ’ వివాదం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఊహించని మలుపులు తిరుగుతోంది. నిన్నటి వరకు సురేఖపై వేటు పడటం ఖాయం, సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలకు తిరుగులేదు అనుకున్న సీన్ మొత్తం ఇప్పుడు పూర్తిగా యూటర్న్ తీసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల వద్ద సురేఖకు అనూహ్యంగా మద్దతు పెరుగుతుండటంతో సీఎం క్యాంపులో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ఢిల్లీలో సీన్ పూర్తిగా మారిపోయింది, రేవంత్ వర్గం డిఫెన్స్లో పడే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఇద్దరు అత్యంత కీలకమైన ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులు కొండా సురేఖకు వెన్నుదన్నుగా నిలిచారు. సురేఖను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయవద్దంటూ వారు హైకమాండ్ పెద్దలతో గట్టిగా లాబీయింగ్ నడుపుతున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇగో కోసం సురేఖపై వేటు వేస్తే.. ఆమె తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే స్థానానికి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హైకమాండ్కు అల్టిమేటం పంపారట.
బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన మహిళా నేత రాజీనామా చేసి, పరకాలలో ఉపఎన్నిక వస్తే అది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుందని సీనియర్ మంత్రులు ఢిల్లీ పెద్దలకు నూరిపోస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మాత్రం తమ పట్టు వదలడం లేదు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని, లేదంటే ప్రభుత్వంపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఇద్దరి పంచాయితీని సర్దుమణిగేలా చేయడానికి హైకమాండ్ ఒక మధ్యేమార్గం వెతికినట్లు తెలుస్తోంది. సురేఖను పూర్తిగా బర్తరఫ్ చేయకుండా, వివాదాలకు దూరంగా ఉండేలా ఆమె ప్రస్తుత శాఖను మార్చి.. వేరే లూప్ లైన్ శాఖను అప్పగించే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు భోగట్టా. మరి ఈ ‘శాఖ మార్పు’ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా లేక తన పంతమే నెగ్గించుకుంటారా అనేది చూడాలి.