గుంటూరు వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అసలైన రాజకీయం కంటే.. సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారి ‘అలక’ ముచ్చటే హైలైట్గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 160 మంది కాషాయ నేతలు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో కలిసి ఎలా గెలవాలి, ఎలా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాలి అని సీరియస్గా ప్లాన్లు వేస్తుంటే.. సోము వీర్రాజు గారు మాత్రం వేదికపైకి తన పేరును లేటుగా పిలిచారంటూ ‘కినుకు’ వహించారు.
ఎంతమంది నేతలు వచ్చి బ్రతిమిలాడినా, “నాకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇవ్వలేదు.. నేను వేదిక ఎక్కేదే లేదు” అని భీష్మించుకుని ముందరి సీట్లోనే కూలబడటం చూసి, “అబ్బా.. పెద్దాయనకు ఈ వయసులోనూ ఎంత పట్టుదల” అని సొంత పార్టీ తమ్ముళ్లే ముక్కున వేలేసుకున్నారు. ఇక ఈ మీటింగ్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ.. “డబుల్ ఇంజిన్ సర్కార్.. ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్” అనే నినాదంతో అక్టోబర్, నవంబర్లలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.
2024 అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని, మనం పోటీ చేసిన చోటల్లా గెలిచి తీరాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కూటమిగా కలిసి వెళ్తున్నాం కాబట్టి 100 శాతం విజయం మనదేనని నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే వేదిక కింద ఒక పెద్ద ఇంజిన్ (సోము వీర్రాజు) ఇలా అలిగి కూర్చుంటే.. ఈ ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ ఎలా సాధ్యమవుతుందో ఆ దేవుడికే తెలియాలని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఎన్నికల ప్లాన్లతో పాటు, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు నెల రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.
పండగలు, పబ్బాలు, బర్త్డే వేడుకలు ఎలాగూ జరిగిపోతాయి కానీ.. పార్టీ మీటింగ్లలో సీనియర్ నాయకుల ఇగోలను శాంతింపజేయడమే ఇప్పుడు ఆ పార్టీ మేనేజర్లకు పెద్ద టాస్క్లా మారింది. మీటింగ్లో సీట్లు, ప్రోటోకాల్స్ కోసం నేతలు ఇలా ఒకరిపై ఒకరు అలకలు పూనుతుంటే.. క్షేత్రస్థాయిలో ఓట్లు వేయాల్సిన సామాన్య జనాలు మాత్రం ఈ ‘కాషాయ కామెడీ’ని చూసి తెగ నవ్వుకుంటున్నారు.