పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితికి దూరంగా వుంటున్నారీయన. బీజేపీలో చేరేందుకు సన్నద్ధమవుతున్నారు. గతంలో వైఎస్ జగన్ వెంట నడిచారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు.
తెలంగాణ నుంచి వైసీపీ తరఫున గెలిచిన ఒకే ఒక్క ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే, ఆ తర్వాత ఆయన వైసీపీకి షాకిచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి దూకేశారు. వైసీపీ నుంచి గెలిచిన తెలంగాణకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా గులాబీ పార్టీలో కలిసిపోయారు. అలా తెలంగాణలో వైసీపీ ఖాళీ అయిపోయింది.
అది గతం. ప్రస్తుతానికి వస్తే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట వివాహ వేడుక జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె వివాహానికి సంబంధించిన రిసెప్షన్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. వందలాది మంది కాదు, వేలాది మంది ప్రజలు ఈ రిసెప్షన్లో సందడి చేశారు.
పలువురు రాజకీయ ప్రముఖుల్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన కుమార్తె వివాహ రిసెప్షన్కి ఆహ్వానించగా, అందరిలోకీ సెంటరాఫ్ ఎట్రాక్షన్గా నిలిచారు వైఎస్ జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ క్రమంలో రిసెప్షన్ జరుగుతున్న ప్రాంతంలో ఒక్కసారిగా హంగామా చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను చూసేందుకు జనం పోటెత్తారు. దాంతో, వారిని కంట్రోల్ చేయలేక అక్కడి సిబ్బంది నానా తంటాలూ పడాల్సి వస్తోంది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అలా అక్కడికి రావడం, అచ్చం తన తండ్రి లాగానే ప్రజలకు అభివాదం చేయడం.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరాలంటూ కొందరు నినాదాలు చేయడం గమనార్హం.
అయితే, ఈ మొత్తం వ్యవహారంపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి గుస్సా అవుతోంది. గులాబీ పార్టీ నేతలెవరూ పెద్దగా ఈ కార్యక్రమానికి హాజరైనట్లు కనిపించలేదు. బహుశా బాస్కి కోపమొస్తుందనేమో.!