YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ముచ్చట్లు వినిపిస్తున్నాయి. అధికారవ వైసీపీ నుంచే ఈ ముందస్తు సంకేతాలు షురూ అయ్యాయి. ఏడాదిలోనో, రెండేళ్ళలోనో ఎన్నికలకు వెళతాం.. అంటూ వైసీపీ ముఖ్య నేత, పైగా ప్రభుత్వ సలహాదారు కూడా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. అందునా, కొత్త మంత్రులు షాక్కి గురయ్యారు. ‘మొన్నే కదా మంత్రి పదవులొచ్చాయ్.. ఇంతలోనే ముందస్తు ఎన్నికల గోలేంటి.?’ అంటూ వాపోతున్నారట కొత్త మంత్రులు.
ఏడాదిలోనో, రెండేళ్ళలోనో ఎన్నికలకు వెళతాం.. అని సజ్జల చేసిన వ్యాఖ్యల్ని రెండు కోణాల్లో చూడాలి. రెండేళ్ళలో ఎన్నికలకు వెళతాం.. అనడంలో అర్థం లేదు. ఎందుకంటే, రెండేళ్ళలో ఎలాగూ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అంటే, ఏడాదిలో.. అన్న మాటనే ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలన్నమాట.
ఏడాదిలో.. అంటే, 2023లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం వుంది. అసలు ముందస్తు ఆలోచన వైసీపీ చేయడానికి కారణమేంటి.? అని ఆరా తీస్తే, ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దిగజారిపోతున్న వైసీపీ ఇమేజ్.. ఈ రెండూ ముఖ్యమైన కారణాలుగా కనిపిస్తాయి.
గతంలోలాగా వైసీపీ నాయకులు యాక్టివ్గా కనిపించడంలేదు. మంత్రి పదవులు కోల్పోయినవారు, మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారు నైరాశ్యలోంకి వెళ్ళిపోయారు. అలాంటివారిలో ఉత్సాహం తెప్పించాలంటే, ఎన్నికలే మార్గం. మరోపక్క, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది.. ప్రజలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితీ ఏర్పడింది.
విపక్షాల మీద ఎంతటి దుష్ప్రచారం చేసినా వైసీపీకి ఒరిగేదేమీ వుండడంలేదు. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల్ని చూపిస్తూ, ఎన్నికలకు వెళితే, గెలిచి మళ్ళీ అధికార పీఠమెక్కొచ్చనీ, ఆ తర్వాత ఐదేళ్ళ వరకూ డోకా వుండదనీ వైసీపీ అధినాయకత్వం భావిస్తోందేమో.! కానీ, అలా ఆలోచిస్తే భంగపాటు తప్పదు. ఎందుకంటే, గడచిన మూడేళ్ళలో ‘మేం రాష్ట్రానికి ఇది చేశాం’ అని చెప్పుకోవడానికి వైసీపీకి ఏదీ లేని దుస్థితి.
