వైఎస్ షర్మిల, తెలంగాణ రాజకీయాల్లో వేసే ముద్ర ఎలా వుంటుంది.?

Will Sharmila Make Impact In Telangana Politics

Will Sharmila Make Impact In Telangana Politics

సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేసిన చోట, సోదరి షర్మిల రాజకీయంగా సత్తా చాటుతానంటున్నారు. సాధ్యమేనా.? ఈ ప్రశ్న సర్వత్రా వినిపించడం సహజమే. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైఎస్సార్ అభిమానులు సతమతమవడమూ సహజమే. కానీ, 2014 నాటి భావోద్వేగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వున్నాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘సెంటిమెంట్’ ఎప్పుడూ ఒకేలా వుండదు. ఏడేళ్ళయ్యింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.

ఇంకా, ఆనాటి ఆ రాజకీయ నాయకులు వేసిన సెంటిమెంట్ ముద్ర అలాగే వుంటుందని ఎలా అనుకోగలం.? ఏడేళ్ళలో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏం సాధించింది.? అన్న చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. అందులో తెలంగాణ రాష్ట్ర సమితి పాలన తాలూకు వైఫల్యాలు ఖచ్చితంగా వుంటాయి. అభివృద్ధి జరగలేదని ఎవరూ అనలేరు.

అదే సమయంలో పాలనా వైఫల్యాలూ కనిపిస్తాయి. అవే వైఎస్ షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీకి ప్రచారాస్త్రాలన్నది షర్మిల అండ్ టీమ్ భావిస్తుండడం గమనార్హం. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి, ఆ తర్వాత హైద్రాబాద్ చేరుకుని.. కొత్త రాజకీయ పార్టీ పేరుని, జెండానీ ప్రకటించబోతున్నారు షర్మిల.

తెలంగాణలో రాజకీయ పార్టీ కోసం ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని పులివెందులకు వెళ్ళి రావడమా.? అన్న ప్రశ్న సహజంగానే తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారుల నుంచి దూసుకొస్తుంది. షర్మిల ఆంధ్రా బిడ్డ గనుక, ఆమె తెలంగాణ బాగుని కోరుకోదని ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. నిజానికి, తెలంగాణలో ఉనికిని చాటుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.. కొంతమేర విజయం సాధించింది కూడా.

కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త గేమ్ షురూ చేసింది. మజ్లిస్ పార్టీ సంగతి సరే సరి. ఇన్ని రాజకీయ పార్టీల నడుమ, షర్మిల పెట్టబోయే కొత్త పార్టీ ఎలా తన ఉనికిని చాటుకుంటుంది.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. కృష్ణా జలాల సమస్య వచ్చిపడింది. కాదు కాదు.. సమస్యని బలవంతంగా తెలుగు ప్రజల మీద రుద్దే ప్రయత్నం జరుగుతోంది. అది, షర్మిల పార్టీకి కూడా తలనొప్పి కాబోతోంది. చూడాలి, షర్మిల వ్యూహాలెలా వుంటాయో.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఆమె ఎలా చెక్ పెట్టగలరో.!