ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాదిలోపు ఎలాంటి పనులు చేయాలి.. ఏవి చేయకూడదో తెలుసా?

సాధారణంగా మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే ఏడాది పాటు ఆ ఇంటిలో ఎలాంటి శుభకార్యాలు పూజా కార్యక్రమాలు చేయకూడదని చాలామంది భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆ ఇంటిలో ఏ విధమైనటువంటి పూజలు చేయకుండా పూజా సామాగ్రి ని దేవుడి ఫోటోలను ఒక వస్త్రంలో చుట్టి ఏడాది పాటు భద్రంగా ఎత్తి పెడతారు. అయితే ఇలా చేయడం కరెక్టేనా.. ఇలా చనిపోయిన ఇంటిలో ఏడాది వరకు పూజలు చేయకూడదని శాస్త్రం చెబుతోందా.. అసలు శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయాలకు వస్తే…

చనిపోయిన ఇంట్లో పూజలు చేయకూడదని, ఏడాది పాటు ఆ ఇంట్లో ఎలాంటి దీపారాధన చేయకూడదని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇలా చనిపోయిన వారి ఇంట్లో ఏడాదిపాటు పూజ చేయకపోవడమే పెద్ద దోషం అని శాస్త్రం చెబుతోంది. దీపం లేని ఇంటిలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.అందుకే ఏడాది వరకు పూజలు చేయకుండా ఉండకూడదని పండితులు చెబుతున్నారు.ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 11 రోజుల పాటు దీపారాధన చేయకూడదు.

పదకొండు రోజుల తర్వాత ఇంటిని శుద్ధిచేసి 12వ రోజు నుంచి దీపారాధన చేయవచ్చు. అయితే ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఆలయాలకు వెళ్లొచ్చు కానీ స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయించకూడదు.దీపం ఎన్నో దుష్టశక్తులను అడ్డుకుంటుంది. కనుక అలాంటి దీపాన్ని ఏడాది పాటు ఇంటిలో వెలిగించకపోతే ఆ ఇంటిలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఆ కుటుంబం ఎన్నో మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తప్పనిసరిగా దీపారాధన చేయటం ఎంతో ముఖ్యం.కేవలం 11 రోజుల పాటు మాత్రమే ఆ ఇంటిలో ఎలాంటి దీపారాధన చేయకూడదని శాస్త్రం చెబుతోంది.