పవన్ సంచలనం: సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితేంటి.?

పవన్ కళ్యాణ్ కాస్త వీరావేశంతో మీడియాకి క్లాసులు పీకే క్రమంలో, సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలిప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ‘రిపబ్లిక్’ సినిమా వేడుకలో పాల్గొన్న పవన్, సినీ పరిశ్రమ సమస్యలతోపాటు రాజకీయ అంశాల్ని ప్రస్తావించారు. మీడియాకి క్లాస్ తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపైనా మాట్లాడారు. సాయి ధరమ్ తేజ్ కోమాలో వున్నాడంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో అంతా షాక్ తినేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుంటున్నాడని కొద్ది రోజుల క్రితమే వైద్యులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన వెంటనే సాయి ధరమ్ తేజ్ స్పృహ కోల్పోయిన మాట వాస్తవం. వెంటనే, ఆయన స్పృహలోకి వచ్చినట్లు కూడా వైద్యులు వెల్లడించారు. చిన్నపాటి సర్జరీ జరిగింది. వెంటిలేటర్ మీద పెట్టారు. ఆ తర్వాత వెంటిలేటర్ క్రమంగా తొలగించి.. తనంతట తానుగా శ్వాస సాయి ధరమ్ తేజ్ తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు.

రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జి అవుతాడని కూడా సమాచారం బయటకు పొక్కుతోంది. ఇలాంటి సమయంలో పవన్ చేసిన ‘కోమా’ వ్యాఖ్యలు, మెగా కాంపౌండ్‌లో కూడా అలజడికి కారణమయ్యాయి. నిజానికి, సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకునే పరిస్థితుల్లో వుంటే, ఆయనతో మాట్లాడించి వీడియో లేదా ఆడియో టేపు విడుదల చేయడమో, కనీసం ఫొటో అయినా విడుదల చేసి వుండాల్సిందన్న భావన అభిమానుల్లో వుంది. ఆసుపత్రిలో వున్న వ్యక్తి తాలూకు ఫొటోలు, వీడియోలు బయటకు రావడమేంటి.? అన్నది ఇంకో చర్చ. సరే, సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు గనుక.. హ్యాపీనే. కానీ, ఈ కోమా వ్యాఖ్యలేంటి.? అసలు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడెలా వున్నాడు.? పవన్ ఎందుకలా అన్నారు.? మెగా కాంపౌండ్ ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిందే. లేదా, ఆసుపత్రి వర్గాలైనా హెల్త్ బులెటిన్ తాజాగా విడుదల చెయ్యాలి. ఇది సాయి ధరమ్ తేజ్ అభిమానుల డిమాండ్.