కేంద్ర విద్యాశాఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. దేశం మొత్తం మీద 47 మందికి ఈసారి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు దక్కింది. అయితే.. ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటు దక్కింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును దక్కించుకోగా… హైదరాబాద్ లోని మలక్ పేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియను కూడా ఈ అవార్డు వరించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 153 మందిని ఆ అవార్డు కోసం ఎంపిక చేసుకోగా… ఫైనల్ గా 47 మందిని ఆ అవార్డు వరించింది.
పద్మప్రియ ప్రస్థానం
హైదరాబాద్, మలక్ పేటలో ఉన్న నెహ్రూ మెమోరియల్ గవర్నమెంట్ స్కూల్ లో పద్మప్రియ మ్యాథ్స్ టీచర్. ఆమెది నల్గొండ జిల్లా. ఆమె దగ్గర చదువు నేర్చుకున్న పిల్లల్లో నూటికి నూరు శాతం పాస్ అయ్యారు. ఆమె గణితం మార్కుల సగటు కూడా 94 శాతం. 2016లో టీచర్స్ ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా యూఎస్ వెళ్లి శిక్షణ పొందిన ఏడుగురు భారతీయ ఉపాధ్యాయుల్లో పద్మప్రియ ఒకరు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును సాధించడంపై పద్మప్రియ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. 1996లో పద్మప్రియ ఎస్జీటీగా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎస్ఏగా ఎంపికయ్యారు.