శ్రీవారి భక్తులకి శుభవార్త … స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల !

TTD

కలియుగ వైకుంఠడు , ఆ తిరుమలేశుడి భక్తులకి గుడ్ న్యూస్. తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్ ‌లైన్ ‌లో అందుబాటులో ఉంచింది. జనవరి 4 నుంచి 31 వరకూ రూ.300 ధరపై ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ ఉదయం విడుదల చేశారు.

January Special Darshan Tickets Released by TTD

రోజుకు 20 వేల చొప్పున టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని, ఒక్కో యూజర్ ఐడీపై ఆరు వరకూ టికెట్లను కొనుగోలు చేయవచ్చని అధికారులు తెలిపారు. కరోనా కట్టడి నిమిత్తం పరిమిత సంఖ్యలోనే స్వామివారి దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 25 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తిరుమలలో ఈ నెల 25 నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం జనవరి 4వ వరకు జరగనుంది. కరోనా దృష్ట్యా మొదట స్థానికులకే వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ప్రకటించారు. ఐతే భక్తులకు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో క్యూలైన్లో ఉన్న వారికి సైతం టోకెన్లు జారీ చేశారు.