అటు తిరిగి ఇటు తిరిగి రవితేజ చేతికొచ్చిన ‘టైగర్’.!

టైగర్ నాగేశ్వరరావు ఎవరు.? అని ఇప్పుడు నెటిజన్లు సోషల్ మీడియాలో వెతుకులాట షురూ చేయడానికి కారణం, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ పేరుతో సినిమా చేస్తుండడమే. ఈ చిత్రానికి ‘దొంగాట’ ఫేం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

నిజానికి, ‘దొంగాట’ సినిమా కంటే ముందే ‘టైగర్ నరసింహారావు’ కథని సిద్ధం చేసుకున్నాడట వంశీ. అప్పటినుంచి ఇప్పటిదాకా రైట్ టైమ్ కోసం ఎదురుచూసిన దర్శకుడు వంశీ, ఈ కథతో పలువురు హీరోల్ని అప్రోచ్ అయ్యాడు.

కొన్నాళ్ళ క్రితం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందనీ, ఈ సినిమాలో రేణు దేశాయ్ ఓ కీలక పాత్ర పోషించబోతోందనీ వార్తలొచ్చాయి. కానీ, ఏమయ్యిందో, ఆ తర్వాత ఆ ప్రచారమంతా తుస్సుమంది.

చివరికి ఇప్పుడీ ప్రాజెక్ట్, రవితేజ హీరోగా.. పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయ్యింది. టైగర్ నాగేశ్వరరావు ఓ దొంగ. స్టువర్టుపురంకి చెందిన టైగర్ నాగేశ్వరరావుని పోలీసులు కాల్చి చంపారు. అనేక దొంగతనాల కేసుల్లో టైగర్ నాగేశ్వరరావు నిందితుడు.

అయితే, నాగేశ్వరరావులో ఇంకో కోణం కూడా వుందనీ, అదే పేదలకు సాయం చేసే కోణమనీ.. దర్శకుడు అంటున్నాడు. ఇంతకీ, రవితేజ ఈ ప్రాజెక్టుతో రిస్క్ చేస్తున్నాడని అనుకోవాలా.? ఇదే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోందిప్పుడు.