ప్రజల వద్దకే పాలన.. అని గతంలో విన్నాం. ఇంటి వద్దకే రేషన్.. అని ఇకపై వినబోతున్నాం. ఔను, వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇంటి వద్దకే రేషన్’ పథకాన్ని చేపట్టనుంది. ఇందు కోసం 9 వేలకు పైగా వాహనాల్ని సమకూర్చింది. ఈ వాహనాల్లో రేషన్ సరుకులు నేరుగా లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళిపోతాయి. లబ్దిదారుల ఇళ్ళ వద్దనే తూకం వేసేసి మరీ, అందించడం జరుగుతుంది. రేషన్ దుకాణాలనగానే ఇందులో నడిచే రాజకీయం అంతా ఇంతా కాదు. రేషన్ డీలర్లు రాజకీయ నాయకులుగా ఎదుగుతున్న వైనం. ప్రభుత్వాలను బెదిరిస్తున్న వైనం కూడా మన ప్రజాస్వామ్యంలో చూశాం. రేషన్ అక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొలతల్లో మాయ.. రేషన్ డీలర్లకు పెద్ద పండగే. ఈ మాయలు చేసే రేషన్ డీలర్లు కోట్లకు పడగలెత్తిన సందర్భాలున్నాయి. ‘రేషన్ మాఫియా’ అని కూడా ఓ మాట రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తుంటుంది. బహుశా ఇకపై ఆ ఆరోపణలకు ఆస్కారం వుండబోదేమో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా రేషన్ సరుకుల్ని ఇంటి వద్ద డెలివరీ చేసే వాహనాలకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల్ని లబ్దిదారులకు అందించేందుకు ప్రత్యేక చొరవ చూపింది ప్రభుత్వం. బ్యాంకుల నుంచి లోన్లు, ప్రభుత్వం నుంచి సాయం.. వంటివి ఏర్పాటు చేసింది.
ఈ రకంగా లబ్దిదారులకు ఉపాధి కల్పించినట్లయ్యింది. నిజానికి, ఇదొక విప్లవాత్మకమైన ఆలోచనగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో, బండి కొనగానే సరిపోదు.. దాని మెయిన్టెనెన్స్ సరిగ్గా చూసుకోవాలి కదా.? అన్న ప్రశ్న తలెత్తకుండా వుండదు. నిజానికి, కొన్ని వాహనాలు ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరుకున్నాయి. ఖాళీగా వుండడమెందుకనుకున్నారో ఏమో.. ఇతరత్రా అవసరాలకి.. మనుషుల్ని రవాణా చేసేందుకూ వినియోగించేశారు. దానికి సంబంధించి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కూడా. ఇంతకీ, ఈ రేషన్ డెలివరీ వాహనాల్లో కొలత సరిగ్గానే వుంటుందా.? రేషన్ అక్రమాలకు చెక్ చెప్పడం అనేది సాధ్యమేనా.? ఇదే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలాంటి కార్యక్రమాలు ప్రజోపయోగమైనవైతే, ఎవరైనా అభినందించి తీరాల్సిందే. కేవలం పబ్లిసిటీ స్టంట్ల కోసమే అయితే.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తాయన్నది నిర్వివాదాంశం.