మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ అభినందన.

సినీ పరిశ్రమకు చేసిన విశేష సేవలకుగానూ ప్రఖ్యాత నటుడు మెగాస్టార్ చిరంజీవిగారికి ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ -2022 అరుదైన పురస్కారం లభించడం పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోషియేషన్ అభినందనలు తెలిపింది. ఈ మేరకు ఎఫ్.సి.ఏ అధ్యక్ష, కార్యదర్సులు సురేష్ కొండేటి, ఎం. లక్ష్మీ నారాయణ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తెలుగు చలచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సృష్టించుకున్న స్వయంకృషీవలుడు మెగాస్టార్ చిరంజీవి అని, సినీ పరిశ్రమకు చేసిన అత్యుత్తమ సేవలకుగానూ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ అవార్డును చిరంజీవిగారికి ప్రకటించడం ముదావాహమని వారు పేర్కొన్నారు.

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2013 నుంచి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు గ్రహీతకు నెమలి చిత్రం కలిగిన రజత పతకం, రూ.10 లక్షలు, ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ అవార్డును వహీదా రెహమాన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, అమితాబ్‌ బచ్చన్‌, సలీమ్‌ ఖాన్‌, విశ్వజిత్‌ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్‌ జోషి అందుకున్నారు.