టీడీపీ కష్టం పగవాడిక్కూడా రాకూడదంతే.!

‘మీ ముగ్గురూ కలిసి పోటీ చేస్తే, మాకు అది అదనపు లాభం. మీ ముగ్గురూ విడివిడిగా పోటీ చేస్తే మాకు 171 సీట్లు వస్తాయ్.. మీ ముగ్గురూ కలిస్తే మాకు 175 సీట్లు వస్తాయ్..’ అని వైఎస్సార్సీపీ అంటోంది. పైకి వైసీపీ ఏం చెప్పినా, తెరవెనుకాల వ్యవహారాలు ఇంకోలా వుంటాయ్.

టీడీపీ, జనసేన, బీజేపీ కలవకూడదన్నది వైసీపీ ఆలోచన. కలిస్తే ఏమవుతుందో వైసీపీకి బాగా తెలుసు. గెలవడం, ఓడటం కాదిక్కడ లెక్క.. బీజేపీతో వైసీపీకి వున్న లింక్ తెగిపోతుంది. అదీ వైసీపీ భయం.

ఇక, టీడీపీది ఇంకో భయం. బీజేపీ, జనసేన కలిసి ముందుకెళితే, ఆ ఇద్దరూ కలిసి తమ మాట వినే పరిస్థితి వుండదని టీడీపీ భయపడుతోంది.

అందుకే, బీజేపీ నుంచి జనసేనను విడదీసేందుకు టీడీపీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. అదే సమయంలో జనసేన మీద టీడీపీలో ఓ వర్గం విషం చిమ్ముతూనే వుంది. టీడీపీలో రెండు నాల్కల ధోరణి గురించి కొత్తగా చెప్పేదేముంది.?

ఓ చేత్తో షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇంకో చేత్తో వెన్నపోటు పొడవడం టీడీపీకి అలవాటే. అందుకే టీడీపీనీ, తమ కూటమి దరిదాపుల్లోకి రానివ్వకూడదని బీజేపీ అనుకుంటోంది. కానీ, అవసరార్ధం టీడీపీ కూడా బీజేపీ, జనసేన కూటమితో కలిసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

రాజకీయాల్లో అవసరాలే వుంటాయ్.. అంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

ఏదిఏమైనా, 2024 ఎన్నికలు చిత్ర విచిత్రంగా వుండబోతున్నాయి. పొత్తులు ముందే ఖరారవుతున్న దరిమిలా, ఓటర్లకు ఓ క్లారిటీ ముందే వచ్చేస్తుంది. సో, ఎవర్ని గెలిపించాలన్న విషయమై నిర్ణయం తీసుకోవడానికి ఓటర్లకూ తగిన సమయం దొరుకుతుంది. అదే వైసీపీ బెంగ. ఓటర్లకు క్లారిటీ రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని వైసీపీ అనుకుంటోంది.