Maheswari: గులాబీ సినిమా షూటింగ్ సమయంలో అలాంటి ప్రమాదం చోటు చేసుకుంది.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి మహేశ్వరి!

Maheswari:అమ్మాయి కాపురం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మహేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ హీరోయిన్ ఆ తర్వాత పెళ్లి, గులాబీ, దెయ్యం, వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న మహేశ్వరి చాలా కాలం తర్వాత మరోసారి బుల్లితెరపై సందడి చేశారు. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు.

బుల్లితెరపై అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరి తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ… గులాబీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలిపారు.

సాధారణంగా నాకు లొకేషన్ లో ఎవరితో మాట్లాడడం పెద్దగా ఇష్టం ఉండదు. అందుకోసమే నాపై షాట్ పూర్తికాగానే పక్కకెళ్లి కూర్చుంటాను. ఈ క్రమంలోనే చాలామంది నన్ను చూసి ఈమె శ్రీదేవి కుటుంబం నుంచి వచ్చింది కదా అందుకే చాలా పొగరు అనే భావనలో ఉండే వారని తెలిపారు. అదేవిధంగా గులాబీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా బయటపెట్టారు.సాధారణంగా నాకు బైక్ జర్నీ అలవాటు లేదు కానీ మేఘాలలో తేలిపొమ్మన్నది అనే పాటలో బైక్ జర్నీ చేయాల్సి వచ్చింది.ఇలా ఈ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎంతో స్పీడ్ గా డ్రైవ్ చేయాలి అదే సమయంలో ఎదురుగా మరో వెహికల్ రావడంతో మేం ప్రయాణిస్తున్న బైక్ లోయలో పడిందనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా మహేశ్వరి అభిమానులతో పంచుకున్నారు. అయితే ఆ తర్వాత ఏమైంది అనే విషయాల గురించి తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.