శ్రీ రెడ్డి మళ్లీ నిద్ర లేచింది: ఆడిపోసుకోవడానికే

మెగా ఫ్యామిలీని ఆడిపోసుకునే వారి లిస్టులో శ్రీ రెడ్డిది ఏ స్థానమో చెప్పలేం కానీ, బోడిగుండుకీ, మొలతాడుకీ ముడి పెట్టేసినట్లుగా అప్పుడెప్పుడో తాను చేసిన రచ్చని, ఇప్పుడు ‘మా’ ఎలక్షన్ వివాదానికి లింకు పెట్టేసి సంచలన వ్యాఖ్యలు చేసేసింది.

అప్పుడెప్పుడో తాను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు నగ్నంగా చేసిన రచ్చ సమయంలో తనకెవ్వరూ మద్దతు పలకలేదనీ, ఇప్పుడేమో ‘మా’ ఎలక్షన్స్‌లో ఓడిపోయినందుకు మీడియా ముందుకొచ్చి గుక్క పట్టి ఏడుస్తున్నారనీ శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. అప్పుడు తనను తప్పు పట్టిన వారిలో హేమ, జీవిత తదితరులున్నారంటూ గుర్తు చేసింది.

మెగా ఫ్యామిలీని ఎత్తి చూపుతూ, మెగా బ్రదర్స్ ఎత్తులు ‘మా’ ఎలక్షన్స్‌లో పారలేదనీ నోటికొచ్చినట్లు ధూషించింది. ‘మా’ అసోషియేషన్‌కి సేవ చేస్తామంటూ ముందుకొచ్చారు కదా.. ఆ సేవ ఎవరు చేస్తే ఏంటని.? అనవసరపు ఏడుపులు ఎందుకు.? అసోసియేషన్ పరువు తీయడానికి కాకపోతే.. అంటూ శ్రీ రెడ్డి తనదైన స్టైల్‌లో ఈ అవకాశాన్ని తన పబ్లిసిటీకి వాడేసుకుంది. ఇక, దాసరి తర్వాత సినిమా ఇండస్ర్టీలో ఆ స్థానం మోహన్ బాబుదే అని ఆమె కుండ బద్దలు కొట్టేసింది.