మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు రెట్టింపు అయ్యాయి. రామ్ చరణ్–ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగా ఇంట పండుగ వాతావరణం నెలకొంది. జనవరి 31 శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఓ బాబు, ఓ పాపకు ఉపాసన జన్మనిచ్చినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అభిమానుల్లో ఆనందం ఉప్పొంగింది.
తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారని, వైద్యులు పూర్తి జాగ్రత్తలతో చికిత్స అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబంలోకి ఇద్దరు చిన్నారులు అడుగుపెట్టడం దేవుడి వరమని, తాతయ్య–నానమ్మలుగా తమ ఆనందం మాటల్లో చెప్పలేనిదని చిరంజీవి–సురేఖ పేరుతో వచ్చిన సందేశం అభిమానులను ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్, సినీ ప్రముఖులు, స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్–ఉపాసన దంపతులకు క్లింకార అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కవలల రాకతో కుటుంబం మరింత పెద్దదైంది. మెగా వారసుడు రావాలని చిరంజీవి గతంలో సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అభిమానుల చర్చకు వస్తున్నాయి. ఆయన కోరిక నెరవేరిందంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

రామ్ చరణ్, ఉపాసనల ప్రేమ వివాహం 2012లో ఘనంగా జరిగింది. దశాబ్దానికి పైగా అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఈ జంట కుటుంబ జీవితం కూడా ఆదర్శంగా నిలుస్తోంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న ఈ దంపతులు ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయం ప్రారంభించారు. కవలల జనన వార్తతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. థియేటర్ల దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు శుభాకాంక్షల సందడి కనిపిస్తోంది. మెగా ఇంట మరోసారి నవ్వులు, కిలకిలారావాలతో మారుమోగుతోంది.
