మోడి తాత, కేసీఆర్ తాత.. నా భూమిని కాజేశారంటూ ఆరేళ్ల బాలుడి పాదయాత్ర

భూమి మీద మనిషికి ఉన్న వ్యామోహం అంతా ఇంతా కాదు. ఈ వ్యామోహంతో దేవుడి భూమినే కాజేసిన ప్రబుద్ధులు ఎంతో మంది ఉన్నారు మన సమాజంలో. ఇక ఇప్పుడు అయితే భూమి ధరలు అకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇంకేముంది మంచి చెడు, పాపం పుణ్యం అన్నీ మంటగలిసిపోతున్నాయి. ఏదే దిక్కు లేని వాళ్లు కనిపిస్తే చాలు… వాళ్ల భూమిని అమాంతం కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం లింగంపల్లిలో చోటుచేసుంది. దీంతో ఓ బాలుడు పాదయాత్ర చేపట్టాడు. తన స్వగ్రామం లింగంపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్ర చేపట్టాడు ఆరేళ్ల నాగప్రణీత్ అనే బాలుడు.

వివరాల్లోకి వెళ్తే…. బాలుడి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. దీంతో తాత ఆ పిల్లవాడి బాగోగులు చూస్తున్నాడు. వంశపారంపర్యంగా వచ్చిన ఎకరం భూమిని చాలా కాలంగా కౌలు చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధి.. తన పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో భూమిని తన పేరిట మార్పించుకున్నాడు. ఏ అండ లేని వీళ్ల ఆస్థిని కాజేసినా అడిగే నాథుడు ఉండన్న దైర్యంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. సాయం చేసే నాథుడు లేక…నలుగురి దృష్టిని ఆకట్టుకొని అయినా తన భూమిని కాపాడుకునేందుకు తాతతో కలిసి ఇలా పాదయాత్రకు చేపట్టాడు ఈ బాలుడు.

మోడీ తాత, కేసీఆర్ తాత నా భూమిని నాకు ఇప్పించండి అంటూ పాదయాత్ర చేపట్టాడు. తన గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించాడు. చూడాలి మరి… అసలు సంగతి ఏంటో…నిజంగానే ఏమైనా అక్రమాలు జరిగాయా లేక లీగల్ లిటిగేషన్లు ఏమైనా ఉన్నాయా…. ఏది ఏమైనా ఈ బాలుడికి వచ్చిన కష్టం మాత్రం అందర్ని కంటతడి పెట్టించింది.