ఆంధ్రాలో అధికార పార్టీ తర్వాత అంత హడావుడి చేస్తున్న పొలిటికల్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీనే. ఇన్నేళ్ళు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్న బీజేపీ ఇప్పుడు చాలా హుషారు అందుకుంది. అందుకు ప్రధాన కారణం కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు. ఢిల్లీ హైకమాండ్ నుండి ఎలాంటి ఆదేశాలు అందాయో తెలీదు కానీ రాష్ట్రంలో బీజేపీ ఎన్నడూ లేనంతగా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. 2024 నాటికి అందితే అదికారం లేదా కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అయినా ఉండాలనేది బీజేపీ అంటున్న మాట. ఆ రెండు స్థానాలు తప్ప అంతకంటే కిందకి దిగడం లేదు. బీజేపీ దూకుడుతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఆస్కారం కనబడుతోంది.
తనదైన పంథాలో సాగిపోతున్న బీజేపీ ఇప్పటికే జనసేనను మిత్రపక్షంగా చేసుకుని జనం దృష్టిని ఆకర్షించింది. పాలక వర్గం మీద ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా పోట్లాడుతోంది. హిందూ దేవాలయాల మీద దాడులు అనే దారాన్ని పట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలన్నంత కసిగా పనిచేస్తోంది. అయితే అదికారం దక్కించుకోవాలి అంటే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే సరిపోదు కదా.. పార్టీని బలోపేతం చేసుకోవాలి. ప్రజెంట్ ఆ పనికి కూడ శ్రీకారం చుట్టారట సోము వీర్రాజు. అసలు రాష్ట్రంలో తమ బలాబలాలు ఎలా ఉన్నాయో మొహమాటం లేకుండా లెక్కలు చూసుకుంటున్నారట.
బీజేపీకి రాష్ట్ర స్థాయి నేతలు లేకపోవచ్చు కానీ లోకల్ లీడర్లు బాగానే ఉన్నారు. నియోజకవర్గాల పరిధిలో పలుకుబడి పర్వాలేదు. ఇన్నాళ్లు నడిపించే నాయత్వం లేక వారంతా కింది స్థాయిలోనే మిగిలిపోయారు కానీ సరైన గైడెన్స్ ఉంటే ఎంతో కొంత పార్టీని నిలబెట్టేవారే. ఇప్పుడు వారందరినీ జవసత్వాలు ఊదే పనిలో ఉంది రాష్ట్ర నాయకత్వం. బీజేపీ చేయించుకున్న సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 65 నుండి 70 నియోజకవర్గాల్లో కమలనాథులకు అనుకూల వాతావరణం ఉందట. వినడానికి ఈ లెక్క షాక్ ఇచ్చేలానే ఉన్నా నిజమని అంటున్నారు బీజేపీ కార్యకర్తలు. రాయలసీమలో బలహీనంగా ఉన్నా ఉత్తరాంధ్రలో బలంగానే ఉన్నామని అంటున్నారు. మొత్తానికి సొంత సర్వేల లెక్కలతో బీజేపీ హైప్ బాగానే పెంచుకుంటోంది.