
‘కెజిఎఫ్’ ప్రభావంతో ప్రశాంత్ నీల్ క్రేజ్ దక్షిణాదిన అమాంతం పెరిగిపోయింది. ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు, బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రధానంగా తెలుగు నిర్మాతలు ప్రశాంత్ నీల్ చుట్టూ గోడ కట్టేశారు. ఆల్మోస్ట్ పెద్ద సంస్థలన్నీ ఆయన డేట్స్ కోసం తెగ ట్రై చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆయన్ను లాక్ చేసుకున్నారు.
ప్రశాంత్ నీల్ తర్వాతి చిత్రం ఎన్టీఆట్ హీరోగా ఉండనుంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇవి కాకుండా గీతా ఆర్ట్స్ లాంటి మిగతా నిర్మాణ సంస్థలన్నీ ఆయనతో చర్చల దశలోనే ఉన్నాయి. ఏదీ ఫైనల్ కాలేదు. ఇదిలా ఉండగా ఈరోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో ప్రాజెక్ట్స్ ఓకే చేసుకున్న నిర్మాతలంతా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి.
దానయ్య కూడ మా దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఒక పోస్టర్ వదిలారు. దీన్నిబట్టి డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. దీంతో ప్రేక్షకులు సైతం వీరిద్దరి ప్రాజెక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది అని ఆశ్చర్యపోతున్నారు. అయితే డివివి సంస్థ తమ ప్రాజెక్టులో హీరో ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు.
కొందరేమో రామ్ చరణ్ అంటే ఇంకొందరేమో మహేష్ బాబు పేరు చెబుతున్నారు. మరి సినిమా ఎవరితో, ఎప్పుడు మొదలు అనేది ఇంకా సస్పెన్స్ అన్నట్టే ఉంది. ఇకపోతే డివివి దానయ్య ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 300 కోట్ల వ్యయంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
