AP: హీటెక్కిన రాప్తాడు రాజకీయం… పరిటాల కుటుంబం పై తోపుదుర్తి ఫైర్?

AP: రాప్తాడు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇటీవల జరిగిన ఎంపీపీ జడ్పిటిసి ఉప ఎన్నికలలో భాగంగా కొన్నిచోట్ల కూటమి ప్రభుత్వ నేతలు అధికారులు వైసిపి వారిని ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే అయితే ఇలాంటి ఘటన రామగిరి మండలంలో కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధికారుల తీరుపై అలాగే పరిటాల కుటుంబం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామగిరి ఎంపిపి స్థానం మహిళలకు రిజర్వ్ అయింది. మొత్తం 9 మంది ఎంపిటిసి సభ్యుల్లో 8 మంది వైసిపికి చెందినవారు ఉన్నారు. టిడిపికి కనీసం పోటీ చేయడానికి మహిళా ఎంపిటిసి సభ్యురాలు కూడా లేరు. అయినప్పటికీ, పరిటాల కుటుంబం దాదాపు వెయ్యి మంది గూండాలను ఎంపిడిఓ కార్యాలయం చుట్టూ మోహరించిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఎస్పి డిఎస్పి శాంతిభద్రతలను నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ, స్థానిక ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ టిడిపి గూండాలను వెంటబెట్టుకుని అరాచకాలు సృష్టించారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. వైసిపికి చెందిన ఎంపిటిసి సభ్యులను బెదిరించారని, వారిని బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేశారు.

చివరకు పేరూరు-2కు చెందిన వైసిపి ఎంపిటిసి సభ్యురాలు భారతిని బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.టిడిపి గూండాలు, రౌడీషీటర్లతో కలిసి ఎస్‌ఐ సుధాకర్‌యాదవ్ అక్కడికి వచ్చి తమ సభ్యులను బెదిరించారని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. “మీరెందుకు వైసిపికి ఓటేస్తున్నారు? మీకు బుద్ధి లేదా? మా వెంట రావాలి” అంటూ వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు.సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో పరిటాల కుటుంబం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.

ఇక ఈయన పోలీసులతో వాగ్వాదానికి వెళ్లినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా ఒక్కసారిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తిరగబడటంతో సహనం నశిస్తే ఇలాంటి తిరుగుబాటు మొదలవుతుంది అంటూ వైసీపీ కార్యకర్తలు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు.