Pushpa : అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘పుష్ప’ సినిమా తొలి పార్ట్ ‘పుష్ప ది రైజ్’ విడుదలకు సిద్ధమయ్యింది. తెలంగాణలో ఈ సినిమాకి అదనపు వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. సాధారణంగా రోజూ ప్రదర్శితమయ్యే నాలుగు ఆటలకు అదనంగా మరో ఆటకు అనుమతినిచ్చింది కేసీయార్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం.
బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాకి బెనిఫిట్ షోలు వేసిన కొన్ని థియేటర్లను ఆంధ్రప్రదేశ్లో సీజ్ చేసిన విషయం విదితమే. టిక్కెట్ల ధరల్ని నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కొంత గందరగోళం వుంది. ఆ జీవోని రాష్ట్ర హైకోర్టు కొట్టివేసినట్లుగా వార్తలొచ్చాయి. అయితే, ఆ వెసులుబాటు పిటిషన్ దాఖలు చేసిన కొన్ని థియేటర్ల యాజమాన్యాలకేనంటూ కొత్త వాదన తెరపైకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లు అర్జున్ అభిమానులు షరామామూలుగానే సందడి షురూ చేశారు. బెనిఫిట్ షోలు వుంటాయంటున్నారు.. అదనపు షోలు కూడా పడతాయనే ధీమాతో వున్నారు. ఇంకోపక్క, బెనిఫిట్ షోలకు అనుమతి లేదు.. అదనపు షోలకు ఆస్కారమే లేదని అధికారులంటున్నారు. ఇదో చిత్రమైన పరిస్థితి.
‘పుష్ప’ తెలుగు సినిమా.. పాన్ ఇండియా స్థాయిని అందుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న సినిమా. కేరళలో ఇబ్బంది లేదు.. కర్నాటకలో సమస్య లేదు.. తమిళనాడులోనూ ఇబ్బందులేమీ లేవు.. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ సినిమాకి ఇబ్బందులెదురవుతున్నాయని అల్లు అర్జున్ అభిమానులంటున్నారు.
ఏమో, రేపు విడుదలయ్యాక పరిస్థితులు ఎలా వుంటాయోగానీ.. సినిమా సందడి విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్ క్రమక్రమంగా వెనకబడిపోతోందనే చెప్పాలి. తెలుగు సినిమా ఇకపై ఆంధ్రప్రదేశ్ మార్కెట్టు మీద పెద్దగా ఆశల్లేకుండా ప్లాన్ చేసుకోవాలేమో.
