పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

‘నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..’ అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పోసాని కృష్ణమురళిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. స్వయంగా పవన్ కళ్యాణ్ తన మీద, తన కుటుంబం మీదా దాడి చేస్తున్నట్లుగా చెబుతున్న పోసాని కృష్ణమురళి, పరోక్షంగా తన తీరు వెనుక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వున్నారనే విషయాన్ని బయటపెడుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి చర్యల్ని ప్రోత్సహిస్తారా.? అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘అభిమానులెవరూ హద్దులు దాటకండి..’ అని పవన్ కళ్యాణ్ గతంలో.. అంటే, శ్రీరెడ్డి విషయంలోనూ.. కత్తి మహేష్ విషయంలోనూ అభిమానులకు సూచించారు.

అలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు, వైసీపీ నాయకులకీ, అభిమానులకీ సూచించాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆ విమర్శలు హద్దులు దాటేయడం కూడా సహజమే. కానీ, మీడియా ప్రతినిథులు సిగ్గుపడేలా విమర్శలు చేస్తే.. తమ కుటుంబ సభ్యులే సిగ్గుపడేలా స్థాయి మరిచిపోయి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తే.. చరిత్ర క్షమించదు. పోసాని కృష్ణమురళి ఉన్నత విద్యావంతుడు. కానీ, ఏం లాభం.? ఆయనకు మాట మీద అదుపు వుండదు. అది గతంలో పలు సందర్భాల్లో నిరూపితమయ్యింది. ఇప్పుడు అది ఇంకోసారి నిరూపితమవుతోందంతే. పోసాని కంటే హేయంగా తిట్టగల సమర్థులు రాజకీయాల్లో వున్నారు. అయినా, తిట్టడం పెద్ద కష్టమా.? ఇక్కడే సంస్కారం.. అనేది చాలామందికి అడ్డు వస్తుంటుంది. అయినా, ఇంట్లో వాళ్ళని తిట్టుకోవడమేంటి.? పోసాని వ్యాఖ్యల్ని మహిళా లోకం అస్సలు సమర్థించదు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారోగానీ, వైఎస్ జగన్ అభిమానినంటూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బజారుకీడ్చేస్తున్నారు పోసాని కృష్ణమురళి.