మేన‌ల్లుడికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్ట్.. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కి త‌ప్ప‌క న‌చ్చుతుంద‌న్న ప‌వ‌ర్ స్టార్

మెగా ఫ్యామిలీ నుండి మ‌రో హీరో ఎంట్రీకు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే మెగాహీరోలు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్, సాయి ధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, అల్లు శిరీష్‌లు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటుతుండ‌గా, ఇప్పుడు మెగా మేన‌ల్లుడు, సాయితేజ్ సోదరుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల కానున్న ఈ సినిమాకు మెగా హీరోలు త‌మ వంతు స‌పోర్ట్ అందించారు. చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుక‌కు హాజ‌రై త‌న మేన‌ల్లుడిని ఆశీర్వ‌దించగా,ఇప్పుడు ప‌వన్ క‌ళ్యాన్ ఉప్పెన ట్రైల‌ర్ చూసి ఈ మూవీ త‌ప్ప‌క ప్రేక్ష‌కుల‌కి న‌చ్చుతుంద‌ని కొనియాడారు.

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొద్ది సేప‌టి క్రితం ఈ మూవీ ట్రైలర్ ను, ప్రమోషనల్ కంటెంట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చూపించారు చిత్ర కథానాయకుడు వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ . ట్రైల‌ర్ చూశాక ప‌వ‌న్ చిత్ర బృందాన్ని ప్ర‌శంసించారు. తొలి చిత్రంలోనే వైష్ణ‌వ్ మంచి పాత్ర ఎంచుకున్నాడు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా… హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థం అవుతోంది అన్నారు..

మ‌న‌కు ప‌రిచ‌యం ఉన్న జీవితాల‌ను, అందులోని ఎమోష‌న్స్ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తే అవి ఎప్ప‌టికి జ్ఞాప‌కంగా మిగిలిపోతాయి. రంగ‌స్థ‌లం, దంగ‌ల్ వంటి చిత్రాలు అలాంటివే. ఉప్పెన చిత్రం కూడా అలానే మిగిలిపోతుంద‌ని ఆశిస్తున్నాను. .మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన‘ ఘన విజయం సాధించాల”ని పవన్ ఆకాంక్షించారు. ఉప్పెన చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించ‌గా, దేవి శ్రీ సంగీతం అందించారు.