Pawan Kalyan: నర్సుల సేవలు వెలకట్టలేనివి… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నర్సులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కావడంతో పవన్ కల్యాణ్ నర్సుల సేవలను అభినందిస్తూ మంగళగిరిలో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు..

ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ నర్సులలో వారు చేసే సేవలను గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…నర్సులు అందించే సేవలు అనన్యసామాన్యమైనవి. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వారు చేసే సేవలు వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నాయి. రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో నర్సుల పాత్ర కీలకమైనది. నిస్వార్థంగా చేసే వారి సేవలను విలువలతో కొలవలేం. ఒక్క నర్సు స్పర్శ కూడా రోగిలో సానుభూతిని, ధైర్యాన్ని కలిగిస్తుందనీ పవన్ కళ్యాణ్ నర్సుల గురించి మాట్లాడుతూ వారిపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని పవన్ కళ్యాణ్ సత్కరించారు. వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భాన్ని ఒక మధురమైన జ్ఞాపకంగా మలిచారు.”కొవిడ్ సమయంలో నర్సులు ప్రాణాలను సైతం పణంగా పెట్టి విధులు నిర్వహించిన తీరును మనం ఎప్పటికీ మర్చిపోలేము. మీ శ్రమను నేను గుండెతొ గుర్తుపెట్టుకున్నాను అంటూ పవన్ తెలిపారు.

ఇక నర్సుల సమస్యలను విన్న పవన్ కళ్యాణ్ మీరు చెప్పిన ప్రతి విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ వృత్తిలో ఉండే వ్యక్తుల సంక్షేమం ఎంతో అవసరం. వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వమే ముందడుగు వేయాలనీ తెలిపారు.