క్రిష్‌కు క‌రోనా రావ‌డంతో డైల‌మాలో ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్

క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో శాంతించేలా లేదు. ఇటు సామాన్యులు, అటు సెల‌బ్రిటీలని సైతం వ‌ణికిస్తుంది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా బారిన ప‌డ‌తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో త‌మన్నా, ర‌కుల్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ వంటి సెల‌బ్స్ క‌రోనా బారిన ప‌డ‌గా, ఇప్పుడు ద‌ర్శ‌కుడు క్రిష్‌కు కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఈ ద‌ర్శ‌కుడు క్వారంటైన్‌లోకి వెళ్ళాడు. కొద్ది రోజుల‌లో ప‌వ‌న్‌తో సినిమా మొద‌లు పెట్టాల‌ని అన్ని సిద్ధం చేసుకున్న స‌మ‌యంలో క్రిష్ క‌రోనా బారిన ప‌డ‌డం నిర్మాత‌లకు ఆందోళ‌న క‌లిగిస్తుంది.

ఇటీవ‌లే సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ సినిమాని కేవ‌లం 40 రోజుల‌లో పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. న‌వ‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన క్రిష్ ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. అతి త్వ‌ర‌లోనే ఈ సినిమాని థియేట‌ర్స్‌లోకి తీసుకు రానున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క్రిష్ తెర‌కెక్కించే పీరియాడిక‌ల్ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్రమాలన్నీ సిద్ధం చేసుకొని సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ద‌మైంది. ప‌వ‌న్ కూడా వ‌కీల్ సాబ్ చిత్ర షూటింగ్ పూర్తి చేసి పీరియాడిక‌ల్ మూవీలో నటించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఈ స‌మ‌యంలో క్రిష్ క‌రోనా బారిన ప‌డ‌డంతో సినిమా మ‌రోసారి వాయిదా ప‌డింది. అప్ప‌ట్లో 15 రోజులు మాత్ర‌మే ప‌వ‌న్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చాడ‌ని వార్త‌లు రాగా, ఇటీవ‌ల నెల‌న్న‌ర అని ప్ర‌చారం చేశారు. ఇప్పుడు క్రిష్‌కు క‌రోనా వ‌చ్చిన నేప‌థ్యంలో అన్నీ తారుమారు అయ్యాయి. ప‌వ‌న్ త‌న డేట్స్ ని ఇప్పుడు ఎలా అడ్జెస్ట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఏఎం రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు . క‌రోనా చేయ‌బ‌ట్టి ఇటు నిర్మాత‌లు అటు హీరోలు చాలా ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు.