పట్టాభి ప్రసహనం.. తర్వాతేం జరుగుతంది చెప్మా.?

టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభి కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదురుచూస్తున్నారట.. పలు కేసుల్లో ఆయన్ను మళ్ళీ అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోందట. ఈ ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. తనపై నమోదవుతున్న కేసులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తానంటున్నారు పట్టాభి. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

ముఖ్యమంత్రిని దూషించిన కేసులో అరెస్టయిన పట్టాభి, ఆ తర్వాత జైలుకు వెళ్ళారు.. ఆ వెంటనే బెయిల్ తెచ్చుకోగలిగారు. పోలీసులు అరెస్టు చేసే విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించలేదని న్యాయస్థానం అభిప్రాయపడటంతోనే పట్టాభిక బెయిల్ మంజూరయ్యిందని న్యాయ నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.

ఇంతకీ, పట్టాభి తదుపరి వ్యూహమేంటి.? పట్టాభి విషయంలో ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఏంటి.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మత్య్సకారుల మనోభావాల్ని దెబ్బతీశారంటూ పట్టాభి మీద కేసులు నమోదయ్యాయట. ఈ కేసులోనూ పట్టాభి అరెస్టవడం ఖాయమంటున్నారు. ఇందులో నిజమెంతో తేలాల్సి వుంది.

కేసులు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పోతే, ఈ ప్రసహనానికి హద్దూ అదుపూ వుండదు. టీడీపీలో చాలామంది నేతలపై ఇలాంటి కేసులే ఎప్పటికప్పుడు నమోదవుతూ వున్నాయి. బీజేపీ, జనసేన నేతల మీదా అడపా దడపా ఇలాంటి కేసులే నమోదవుతూ వస్తున్నాయి. ఈ తరహా కేసుల్లో ఆయా నాయకులకు పెద్దగా కలుగుతున్న నష్టం గానీ, వారికి అవుతున్న జ్ఞానోదయంగానీ ఏమీ వుండటంలేదు.

పోలీసులది ప్రతిసారీ అత్యుత్సాహం, ఆ తర్వాత వృధా ప్రయాసే అవుతోందన్న విమర్శలున్నాయి. బహుశా పట్టాభి ధైర్యం కూడా అదే కావొచ్చు.