ఆన్ లైన్ మీడియాపై కేంద్రం నిఘా

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్, వెబ్‌సైట్స్ పై కేంద్రం నిఘా పెట్టింది. వీటి విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు వైబెసైట్లు, ఓటీటీలపై నిఘా పెట్టేందుకు వీటిని సమాచార శాఖ పరిధిలోకి తీసుకొస్తూ… గెజిట్ విడుదల చేసింది. ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం కూడా పెట్టేశాడు. అమలులోకి వచ్చిన తాజా నిబంధనల మేరకు… ఇకపై యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటు చేయాలంటే సమాచార శాఖ అనుమతి తప్పనిసరి. అశ్లీలాన్ని అరికట్టడంతో పాటు తప్పుడు సమాచారం విస్తరించకుండా ఉండేదుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  కేంద్రం ప్రకటించింది. ఇకపై ఎవరు పడితే వారు యూట్యూబ్ ఛానెల్స్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.

అయితే ఈ నిబంధనలతో డిజిటల్ మీడియాకు కొన్ని ప్రయోజనాలు కూడా లభించబోతున్నాయని స్పష్టం చేసింది. ఆన్‌లైన్ ఛానెల్స్, వెబ్‌సైట్‌లకు సాంప్రదాయ మీడియాకు కలిగే ప్రయోజనాలు ఇకపై డిజిటల్‌ మీడియాకు కల్పించే అవకాశం ఉందని కేంద్రం సూచనా ప్రాయంగా తెలిపింది. రానున్న రోజుల్లో ఆన్ లైన్ ఛానల్స్ ఏర్పాటు చేసేందు లైసెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ఈ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ఇంకా పెంచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని సమాచారం.

కిందటి ఏడాదే… న్యూస్‌ వెబ్‌సైట్లను అధికారిక నియంత్రణల పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ముసాయిదా బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయింది. గతం కొంత కాలంగా సోషల్ మీడియ సాయంతో చాలా మంది విద్వేషాన్ని విస్తరిస్తున్నారు. హింసను ప్రేరేపిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఇష్టం వచ్చిన విధంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీంతో కేంద్రం ఈమేరకు కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది.