భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ సంబంధాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఎప్పుడైతే ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉంటాయో సహాయం, భద్రత మెండుగా ఉంటాయనేది మోదీ అభిప్రాయం. అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుండి తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ వచ్చారు. ఈ పర్యటనల మూలంగా అనుకున్నట్టే పెద్ద దేశాలతో మైత్రి బలపడటమే కాకుండా అనేక రంగాల్లో కొత్త ఒప్పందాలు ఏర్పడ్డాయి. ఇలా మోదీ టూర్లతో ప్రయోజనాలతో పాటు ఖర్చులు కూడ తడిసిమోపడయ్యాయి. 2015 నుండి ఇప్పటివరకు మోదీ చేసిన పర్యటనలకు అక్షరాలా 517.82 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట.
పార్లమెంట్లో విపక్ష పార్టీల సభ్యుల కోరిక మేరకు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి మురళీధరన్ ప్రధాని పర్యటనలకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాల్లో పర్టటించారు. ఒక్కో దేశంలో 5 సార్లు పర్యటించారు. అలాగే జర్మనీ, ఫ్రాన్స్, యూఏఈ, శ్రీలంక, సింగపూర్, బ్రెజిల్ లాంటి దేశాల్లో కూడ పర్యటించారు. మోదీ పర్యటించిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దృఢమయ్యాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారం కూడా పెరిగిందని విదేశాంగ సహాయ మంత్రి అన్నారు.
అయితే గతంలో 2014 మధ్య నుండి 2018 వరకు మోదీ పర్యటనల కోసం 2000 కోట్లు ఖర్చైనట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మొత్తాన్ని ప్రత్యేక విమానాలు, వాటి నిర్వహణ కోసమే వెచ్చించారు. ఈ ఖర్చుల మీద అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ఇలా పర్యటనలకే వేల కోట్లు తగలేస్తే దేశం బాగుపడినట్టేనని, దేశంలో వ్యవసాయం సహా అనేక రంగాలు దీనావస్థలో ఉంటే ప్రధాని టూర్లు తిరుగుతున్నారని వాఖ్యానించింది. అయితే ఆరోపణలు ఎలా ఉన్నా మోదీ తరహాలో విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మరొకరు లేరనేద నిజం. కరోనా లాక్ డౌన్ వలన ఈమధ్య ఆయన టూర్లు తగ్గాయి కానీ లేదంటే ఇంకో రెండు మూడు పర్యటనలు చేసేవారే.