ఏడు కోట్ల ప్ర‌శ్న‌కు అడుగు దూరంలో.. కోటిశ్వ‌రురాలిగా మారిన ఐపీఎస్ ఆఫీస‌ర్

రెండు ద‌శాబ్ధాలుగా బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న రియాలిటీ షో కౌన్‌ బనేగా క‌రోడ్‌ప‌తి (కేబీసీ). స‌క్సెస్ ఫుల్‌గా సాగుతూ వ‌స్తున్న ఈ షోని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్ చేస్తున్నారు. సీజ‌న్ 3 త‌ప్ప మిగ‌తా సీజ‌న్స్ అన్నింటికి అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా ప‌ని చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం సీజ‌న్ 12 న‌డుస్తుండ‌గా,ఈ షోలో ఢిల్లీకి చెందిన న‌జియా న‌సీమ్ అనే మ‌హిళ తొలిసారి కోటి రూపాయ‌లు గెలుచుకున్నారు. ఏడు కోట్ల ప్ర‌శ్న‌పై త‌న‌కు పూర్తి క్లారిటీ లేక‌పోవ‌డంతో కోటి రూపాయల ద‌గ్గ‌ర ఆగింది.

ఈ సీజ‌న్‌లో మ‌రో మ‌హిళ కోటి రూపాయ‌ల బ‌హుమ‌తి గెలుచుకుంది. ఆమె ఎవ‌రో కాదు ఐపీఎస్ ఆఫీస‌ర్ మెహ‌తా శ‌ర్మ‌. త‌న‌కున్న లైఫ్ లైన్స్ అన్నింటిని చ‌క్క‌గా వినియోగించుకుంటూ కోటి రూపాయ‌ల వ‌ర‌కు చేరుకున్న మెహ‌తా ఏడు కోట్ల ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పిందా లేదా అనే విష‌యాన్ని సస్పెన్స్ లో ఉంచారు. సోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా మెహ‌తా శ‌ర్మ‌కు సంబంధించిన ప్రోమో విడుద‌ల చేశారు. ఇందులో కోటి రూపాయ‌లు గెలుచుకున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గా, ఏడు కోట్ల ప్ర‌శ్న‌పై సందేహం రేకెత్తించారు.

మెహ‌తా శ‌ర్మ‌కి ఏడు కోట్ల ప్ర‌శ్నేంటి, ఆమె ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పిందా లేదా అంటే సెప్టెంబ‌ర్ 17న టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు. ఇంతకుముందు ఎపిసోడ్‌లో కూడా నటి రత్నా ప్రతాక్‌ షా, స్వయం డైరెక్టర్‌, వ్యవస్థాపకురాలు కరమ్‌వీర్‌ అనురాధ కపూర్‌లు ఇద్దరూ కలిసి రూ. 25 లక్షల గెలుచుకున్నారు. రూబి సింగ్‌ అనే మరో కంటెస్టెంట్‌ కూడా రూ. 25 ల‌క్ష‌లు గెలుచుకొని మ‌ధ్య‌లోనే నిష్క్రమించారు. బ్రిట‌న్ షో ఆధారంగా రూపొందిన కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షో ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తుండ‌డం గొప్ప విష‌యం అనే చెప్పాలి.