తెలంగాణా: రాష్ట్రంలో నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగిపోవడంతో ఉద్యోగాల భర్తీపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలపై శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల్లో కలిపి తొలి దశలో 50వేల ఉద్యోగాల భర్తీ చేయాలన్న కేసీఆర్ తక్షణమే ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. అలాగే, ప్రమోషన్ల తర్వాత ఖాళీ అయ్యే ఉద్యోగాలను రెండో దశలో భర్తీ చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నూతన జోనల్ విధానం ద్వారానే ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. గత పాలనలో ఉద్యోగాల భర్తీ అస్తవ్యస్తంగా ఉండేదన్న సీఎం కేసీఆర్ స్థానికులకు న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చామన్నారు. తొలి దశలో 50వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీ అయ్యే ఉద్యోగాలను రెండో దశలో భర్తీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.