జియో న్యూ ఇయర్ గిఫ్ట్ ..ఆ కాల్స్ ఇకపై ఫ్రీ !

రిలయెన్స్ జియో యూజర్లకు శుభవార్త. 2021 జనవరి 1 నుంచి ఆఫ్ నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం అని రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రకటించింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI సూచనల మేరకు 2021 జనవరి 1 నుంచి అన్ని డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌కు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలను తొలగిస్తున్నట్టు రిలయెన్స్ జియో ప్రకటించింది.

జనవరి 1 నుంచి అన్ని డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చని ప్రకటించింది. అంటే ఇకపై మీరు జియో నుంచి జియోకు, జియో నుంచి ఏ నెట్వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడికి కాల్స్ చేసుకున్నా ఉచితమే. దీని ద్వారా భారతదేశంలో ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉండటంతో ఫ్రీ-వాయిస్ నేషన్‌గా మారుతుందని రిలయెన్స్ జియో ప్రకటించింది.

రిలయెన్స్ జియోలో ఇప్పటికే ఆన్ నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. 2019 సెప్టెంబర్‌లో అప్పటి పరిస్థితుల నేపథ్యంలో రిలయెన్స్ జియో ఆఫ్‌నెట్ వాయిస్ కాల్స్‌కు ఐయూసీ ఛార్జీలను వసూలు చేయకతప్పలేదు. అయితే ట్రాయ్ ఐయూసీ ఛార్జీలను తొలగించేవరకు ఈ పరిస్థితి ఉంటుందని అప్పట్లోనే రిలయెన్స్ జియో ప్రకటించింది. అప్పుడు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఆఫ్ నెట్ వాయిస్ కాల్స్‌ను ఉచితం చేసింది.