
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులెవరూ ప్రజలకు నచ్చకపోతే, ‘నోటా’ బటన్ వినియోగించుకోవచ్చు. ‘ఎవరూ కాదు’ అని ‘నోటా’కి అర్థం. ‘నోటా’ అంటే నన్ ఆఫ్ ది ఎబౌ. అసలు దాని అర్థమేంటి.? దాన్ని వినియోగిస్తున్న తీరు ఏంటి.? అంటూ ‘నోటా’ అభిమానులైన ప్రజాస్వామ్యవాదులు ఏళ్ళ తరబడి ప్రశ్నిస్తూనే వున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది. ‘నోటా’కి అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు పడితే, ఆ ఎన్నిక రద్దు చేయాలన్నది సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్. కానీ, 99 ఓట్లు నోటాకి వచ్చి, ఒక్క ఓటు బరిలోకి దిగిన అభ్యర్థికి వచ్చినా.. ఆ అభ్యర్థే గెలుస్తాడన్నది ప్రస్తుతం అమల్లో వున్న ఎన్నికల నిబంధన. ఎమ్మెల్యే అయ్యేందుకో, ఎంపీ అయ్యేందుకో అభ్యర్థులు బరిలో నిలబడతారు. అలాంటివాళ్ళని ఓటర్లు ‘నోటా’ తిరస్కరించినా కూడా, చట్ట సభలకు వెళ్ళడమేంటి.? అన్నది కామన్ లాజిక్.
మన ప్రజాస్వామ్యమే అలా తగలడింది.. దీన్ని బాగు చేయలేం.. అంటూ ‘నోటా’ విషయమై జరుగుతున్న అన్యాయంపై ప్రజాస్వామ్యవాదులు గళం విప్పుతూనే వున్నారు ఏళ్ళ తరబడి. నోటా అమల్లో వున్నా కూడా, ఏకగ్రీవాలు జరగడం.. ఇదొక విచిత్రం. సరే, ఇప్పుడు వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళింది గనుక, ఏం తేలుతుందో వేచి చూడాలి. ప్రభుత్వాలు ఒప్పుకుంటే, ఎన్నికల కమిషన్ ఈ విషయమై కాస్త సీరియస్గా ఆలోచిస్తే, ‘నోటా’కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ‘నోటా’కి న్యాయం జరగడమంటే, దేశ ప్రజాస్వామ్యానికే న్యాయం జరిగినట్లన్న భావన చాలామందిలో వుంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో 20 శాతం ఓట్లు వచ్చినోడు కూడా గెలిచేస్తున్నాడు.. బరిలో ఎక్కువ మంది సమ ఉజ్జీలు నిలబడితే అంతే మరి. అంటే, 80 శాతం మంది తిరస్కరించిన వ్యక్తి అధికారంలోకి వస్తున్నాడన్నమాట. వినడానికే జుగుప్సాకరంగా వున్నా, ఇలాంటి వింతలు మన ప్రజాస్వామ్యంలో చాలానే జరుగుతున్నాయ్.
