Crime News: అనంతపురం జిల్లాలో దారుణం.. మద్యం మత్తులో దాడి చేసి హత్య చేసిన భర్త..!

Crime News: మద్యం అలవాటు కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ మాయదారి అలవాటు వల్ల అనారోగ్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వయసు వ్యత్యాసం లేకుండా చిన్నపిల్లలు,మహిళలు, వృద్ధులు కూడా మద్యం కి బానిసలై విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది.

వివరాలలోకి వెళితే..అనంతపురం(Anantapur) జిల్లా శెట్టూరు మండలంలోని పెరుగుపాళ్యం గ్రామానికి చెందిన చిన్న నరసింహప్ప, లక్ష్మీదేవి దంపతులు వారికి ఉన్న కొద్దిపాటి పొలం లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారులు ఇద్దరికీ వివాహం కాగా..చిన్న కుమారుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. పొలం పనులు చేసుకుని హాయిగా జీవనం సాగిస్తున్న వారి జీవితంలో మద్యం చిచ్చు రేపింది. నరసింహ మద్యానికి అలవాటు పడి ఏ పని చేయకుండా ఇంటివద్దనే ఉంటూ నిత్యం మద్యం తాగుతూ ఉండేవాడు.

లక్ష్మీదేవి ఒక్కతే కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. ఈ క్రమంలో నరసింహ మందు తాగడానికి డబ్బు కోసం భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. మద్యం అలవాటు మానుకోమని భర్తకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను వినకపోగా డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఇటీవల నరసింహ మందు తాగడానికి డబ్బులు కావాలని వారిని అడగగా ఆమె లేవని చెప్పటంతో భార్య మీద కోపాన్ని పెంచుకున్నాడు.

మందు తాగడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని భార్య
మీద కోపం పెంచుకున్న నరసింహ అర్ధరాత్రివేళ అందరూ నిద్రపోతున్న సమయంలో మద్యం మత్తులో విచక్షణ రహితంగా భార్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. భర్త దాడి చేయడంతో లక్ష్మీదేవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఉదయం చుట్టుపక్కల వారు లక్ష్మీదేవి మరణించి ఉండటాన్ని గమనించి నరసింహ ను నిలదీయగా అతను పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు అందువల్ల వారు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నరసింహా ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.