ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల రగడ: ఎవరి గోల వారిదే.!

చంద్రబాబు హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ అదరగొట్టిందంటూ టీడీపీ అనుకూల మీడియా పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురించింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఉద్ధరించేస్తున్నారంటూ కథనాల్ని వండి వడ్డించింది. అప్పట్లో, చంద్రబాబుకి వ్యతిరేకంగా సాక్ష మీడియా వంటకాలు నడిచాయ్.

ఇప్పుడు క్యారెక్టర్స్ తారు మారయ్యాయ్. కంటెంట్ మాత్రం అదే. అప్పట్లో వైసీపీ మీడియాలో వచ్చినట్లు ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియాలో కథనాలొస్తున్నాయి.

అప్పట్లో టీడీపీ జబ్బలు చరుచుకున్నట్టు, వైసీపీ ఇప్పుడు జబ్బలు చరుచుకుంటోంది. అప్పట్లో వైసీపీ వెటకారం చేసినట్లు ఇప్పుడు టీడీపీ వెటకారం చేస్తోంది. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.

ఈ ర్యాంకుల వల్ల ఎలాంటి ప్రయోజంనం వుండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదొక గ్యాంబ్లింగ్ అంటారు ఆర్థిక రంగ నిపుణులు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన ర్యాంకులు కాబట్టి, ఈ ర్యాంకులతో రాష్ట్రాలకు ఏదో ఒరిగిపోతుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా దేశ ఆర్థిక ప్రగతి, రాష్ట్రాల ఆర్థిక ప్రగతి అయోమయంలో పడ్డాయ్. అప్పులు తప్ప, అభివృద్ధి కానరావడంలేదు. మరెలా ఈ ర్యాంకులు.? అంటే, అదే మరి కామెడీ అంటే.! ఈ కామెడీ గతంలోనూ కొనసాగింది, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువగా నడుస్తోందంతే.