Telugu States : తెలుగు రాష్ట్రాల్లో ‘బీజేపీ డబుల్ ఇంజిన్ పాలసీ’ సాధ్యమేనా.?

Telugu States

Telugu States : ‘డబుల్ ఇంజిన్’ అంటూ భారతీయ జనతా పార్టీ ఓ బలమైన నినాదాన్ని జనంలోకి తీసుకెళుతోంది. దానర్థం, కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో వుండాలని. ఆ దిశగానే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలు అధికారంలో వున్న రాష్ట్రాలపై తనదైన రాజకీయాన్ని ప్రయోగిస్తోంది.

కాగా, ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చిన ఆనందంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రజలు ‘డబుల్ ఇంజిన్ థీమ్’కి పట్టం కట్టారని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఇదే నినాదంతో దూసుకుపోతుందని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బీజేపీ దేశంలో మరింత బలోపేతమవుతుందనీ చెప్పుకొచ్చారు.

యోగి ఆదిత్యనాథ్ అంచనాలే నిజమైతే, ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై నరేంద్ర మోడీ కూర్చుంటారన్నమాట. కానీ, ‘డబుల్ ఇంజిన్ పాలసీ’ బీజేపీ చెబుతున్నట్లు అన్ని రాష్ట్రాల్లోనూ సాధ్యమేనా.? తెలుగు రాష్ట్రాల్లో (Telugu States ) బీజేపీ పరిస్థితేంటి.? అంటే, తెలంగాణలో కాస్త బెటర్.. అలాగని, అధికారంలోకి వచ్చేంత సీన్ అయితే బీజేపీకి లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే బీజేపీని జనం అస్సలు పట్టించుకోవడంలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు వస్తే అది గొప్ప విషయమే. జనసేన పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చేస్తామని చెబుతోన్న బీజేపీ, ఆ జనసేన దెబ్బ తినడానికి తానే కారణమవుతున్న విషయాన్ని విస్మరిస్తోంది.

గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకుని టీడీపీని నాశనం చేసిన బీజేపీ, ఇప్పుడు జనసేనను నాశనం చేస్తోంది. ఈ తరహా రాజకీయాలతో డబుల్ ఇంజిన్.. అనే మాటని తెలుగు రాష్ట్రాల్లో బిజేపీ వినియోగిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?