ఇళ్లు మేమే కట్టిస్తాం…పెళ్లి మేమే చేస్తామంటున్న కేటీఆర్

పేదల సొంతింటి కళను సాకారం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సర్కారు. ఈరోజు డబుల్ బెడ్ ఇండ్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ప్రారంభించారు. తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. హైదరాబాద్ జియాగూడ లోని 840 ఇళ్లూ, కట్టెల మండి లో 120, గోడే కా కబర్ లో 192 ఇళ్లను అర్హులైన నిరుపేదలకు అందించారు మంత్రి కేటీఆర్.

ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్న పెద్దలు మాటలను తాము చేసి చూపిస్తున్నామని చెప్పారు. ”ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా ” అని దేశవ్యాప్తంగా అన్నది కేవలం ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే అని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తీసుకొచ్చింది అందుకోసమే అని గుర్తు చేశారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లికి లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నది తామేనని అన్నారు. హైదరాబాద్ లో నిరుపదేలకు సుమారు యాభై లక్షలు విలువ చేసే డబల్ బెడ్ రూం ఇళ్లను తాము గట్టిస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 75 వేల పైచిలుకు ఇళ్ళు కడుతున్నామని వెల్లడించారు. ఆలస్యమైనా సరే నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లు కడుతున్నామని అందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని మరోసారి గుర్తు చేశారు కేటీఆర్. ఇళ్లు లేని వాళ్లు డబల్ బెడ్ రూం ఇళ్లకు, ఆర్థిక స్థోమత లేని వాళ్లు షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీకి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.