వ్యాక్సినేషన్ కార్యక్రమం షురూ … పూణె నుండి పయనమైన ట్రక్కులు !

కరోనా మహమ్మారి జోరుకి భారత్ అతి త్వరలో అడ్డుకట్టవేయబోతుంది. దేశంలో జనవరి 16నుంచి కరోనావైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానుంది. ముందుగా 3కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాక్సిన్ తరలించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

Covishield: రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌ రవాణా

పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్ తయారీ కేంద్రం నుంచి తొలి విడత వ్యాక్సిన్లతో కూడిన ట్రక్కులు ఈ తెల్లవారుజామున బయటకు వచ్చాయి. పూర్తి భద్రత నడుమ బయలుదేరిన మూడు ట్రక్కులు పూణె విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అవి దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరుకోనున్నాయి. మొత్తం 478 పెట్టెల్లో టీకాలను భద్రపరిచిన అధికారులు, వాటి రవాణా కోసం జీపీఎస్ సౌకర్యం ఉన్న ట్రక్కులను ఉపయోగించారు. కాగా, ఒక్కో పెట్టె బరువు 32 కిలోల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.

పూణే నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను వినియోగించనున్నారు. ఇందులో రెండు కార్గో విమానాలు కాగా, 8 వాణిజ్య విమానాలు ఉన్నాయి. తొలి కార్గో విమానం హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్ వెళ్లనుండగా, రెండోది కోల్‌కతా, గువాహటి వెళుతుంది. సమీపంలోని ముంబైకి మాత్రం రోడ్డు మార్గం ద్వారానే టీకాలు చేరుకోనున్నాయి.