Positive news of Omicron: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంటే మరోవైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ చాప కింద నీరులా ప్రవహిస్తుంది. దేశంలో జరుగుతున్న పరిశోధనలు , నివేదికల ఆధారంగా మూడో వేవ్ తప్పదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. మహమ్మారి తీవ్రతను బట్టి క్రమక్రమంగా నిబంధనలను పెంచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
గత రెండు వేవ్ ల తాకిడికి తల్లడిల్లిన ప్రజలు ఈ మూడో వేవ్ గురించి లోలోపల భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ సమయంలో కొంత ఊరటనిచ్చే వార్తొకటి బయటకొచ్చింది. మునుపటి కోవిడ్ -19 వేరియంట్ లతో పోలిస్తే ఓమిక్రాన్ బారిన పడిన వ్యక్తులు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు 50 శాతం నుండి 70 శాతం తక్కువగా ఉంటాయని UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చేసిన అధ్యనం నివేదించింది. అంతేకాకుండా బూస్టర్ డోస్ తీసుకున్న 10 వారాల తర్వాత ఓమిక్రాన్ ను ఎదుర్కునే రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని ఈ నివేదిక పేర్కొంది.
ఇండియాలో ఇప్పటివరకు 415 ఓమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి 115 మంది కోలుకోగా 300 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 108 కేసులు, ఢిల్లీలో 79, గుజరాత్ లో 43, తెలంగాణాలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటక 31, రాజస్థాన్లో 22, ఆంధ్ర ప్రదేశ్ లో 4, ఒడిశాలో 4, హర్యానాలో 4, పశ్చిమ బెంగాల్ లో 3, జమ్మూ కాశ్మీర్ లో 3, ఉత్తర్ ప్రదేశ్ లో 2, చండీగఢ్ లో 1, లడఖ్ లో 1, ఉత్తరాఖండ్ లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 140 కోట్ల పైగా టీకాలు వేయడం జరిగిందని భారత వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.