విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టిన పంజాబీ ముద్దుగుమ్మ‌

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా రూపొందుతున్న ఈ చిత్రాల‌పై అభిమానుల‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన పూరీ జ‌గ‌న్నాథ్‌- ఛార్మీ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల‌లో రూపొందిస్తుండ‌గా, మిగతా భాష‌ల‌లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు. క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

రీసెంట్‌గా లైగ‌ర్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. పూరి.. ఛార్మిలతో పాటు ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ కూడా నిర్మిస్తుండగా ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ముంబైలోని కొన్ని ప్రాంతాల‌లో ప్ర‌స్తుతం కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో ఛార్మి.. లైగ‌ర్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను బైక్‌పై ఎక్కించుకొని ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌న్ను నా బైక్ ఎక్కారు. షూటింగ్ గ్యాప్‌లో ఇద్ద‌రం క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టాం అంటూ ఛార్మి త‌న ట్వీట్ లో పేర్కొంది. ప్ర‌స్తుతం ఛార్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి దిగిన పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక లైగ‌ర్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాతో భారీ సంచ‌ల‌నాలు సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. సినిమా విడుద‌ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 9 త‌ర్వాత లైగ‌ర్ ప్ర‌భంజ‌నం ఏ విధంగా సాగుతుందో చూడాలి.