ఓటర్లను తిట్టడం అనే సరికొత్త ట్రెండ్కి తెరలేపారు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. అధికారం కోల్పోయానన్న అసహనమో, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న తనను ఓటర్లు లెక్క చేయడంలేదన్న అసహనమో.. కాణం ఏదైతేనేం, చంద్రబాబు మాత్రం కనీ వినీ ఎరుగని రీతిలో అసహనానికీ, అనవసర ఆవేశానికీ గురవుతున్నారు.
పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో దెబ్బతిన్న చంద్రబాబు, మునిసిపల్ ఎన్నికలొచ్చేసరికి ఓటర్లను తిట్టడం మొదలు పెట్టారు. ‘సిగ్గు లేదు మీకు..’ అంటూ విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో చంద్రబాబు ఓటర్లను అవమానించిన తీరు, అక్కడ టీడీపీ విజయావకాశాల్ని దెబ్బతీసింది. లేకపోతే, విశాఖతో అలాగే విజయవాడ, గుంటూరుల్లో టీడీపీ తన ఉనికిని చాటుకునేదే. అది నిన్నటి వ్యవహారం. ఇక, ఇప్పుడు తిరుపతి ఎన్నికల హోరు మొదలయ్యింది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికకీ చంద్రబాబే టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్.
ఈ క్యాంపెయిన్ సందర్భంగా చంద్రబాబు ఏం చేయబోతున్నారు.? అంటే, ‘ఇంకేం చేస్తారు, ఓటర్లను తిడతారు.. తద్వారా వైసీపీని గెలిపిస్తారు..’ అనే చర్చ అక్కడ జరుగుతోంది. మొన్నామధ్య చిత్తూరు పర్యటన.. అంటూ, తిరుపతి విమానాశ్రయంలో చంద్రబాబు హైడ్రామాకి తెరలేపడం అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి డ్రామాలకు కాలం చెల్లిందని మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. సో, చంద్రబాబు వద్ద వున్న అస్త్రాలన్నీ అయిపోయాయన్నమాట. చివరికి ‘ఓటర్లను తిట్టడం’ అన్న అస్త్రాన్నీ చంద్రబాబు ప్రయోగించేశారు. గుంటూరు, విజయవాడల్లో తిట్టినట్లు.. తిరుపతిలో చంద్రబాబు ఓటర్లను తిట్టాలనే ఆలోచన ఏమన్నా పెట్టుకుంటే, ఈసారి టీడీపీ ‘నోటా’తో పోటీ పడాల్సిందేన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.