చెరిజగం వైపుగా చంద్రబాబు పొత్తు ఆలోచనలు.?

Chandrababu

2024 ఎన్నికల్లో పొత్తులు ఎలా వుంటాయ్.? అన్నదానిపై గత కొద్ది కాలంగా ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీడీపీ – బీజేపీ – జనసేన కలుస్తాయని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ‘దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్యండి..’ అంటూ వైసీపీ, ఆ మూడు పార్టీలకు సవాల్ విసురుతున్న వైనం రాను రాను హాస్యాస్పదంగా తయారైంది.

ఇక్కడ వైసీపీ భయపడుతోందన్న సంకేతాలు స్పష్టంగా బీజేపీ అధిష్టానానికి అందాయని, టీడీపీ భావిస్తోంది. ‘టీడీపీ విషయంలో బీజేపీ మెత్తబడే సూచనలు వున్నాయి. బీజేపీ గనుక కలిసొస్తే, 2024 ఎన్నికల్లో మళ్ళీ 2014 నాటి కాంబినేషన్ సెట్ అవుతుంది..’ అంటూ చంద్రబాబు, టీడీపీ ముఖ్య నేతలతో ఇటీవల వ్యాఖ్యానించారట.

దూకుడు పెంచిన చంద్రబాబు దూతలు.. ఢిల్లీలో చంద్రబాబు దూతల దూకుడు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతోపాటు, బీజేపీ జాతీయ నాయకత్వంతోనూ ఆ దూతలు మంతనాలు షురూ చేశారట. టీడీపీ – బీజేపీ పొత్తు చారిత్రక అవసరమనీ, అవసరమైతే ‘పవర్ షేరింగ్’ కూడా చేసుకోవచ్చని ఆ దూతల ద్వారా సమాచారం పంపుతున్నారట చంద్రబాబు.

అంటే, గెలిచే సీట్లను బట్టి టూ ప్లస్ టూ ప్లస్ వన్ అన్నమాట. రెండేళ్ళు ఒకరు, ఇంకో రెండేళ్ళు మరొకరు, ఏడాది ఇంకొకరు అన్నమాట. కానీ, ఇది వర్కవుటయ్యే ఈక్వేషనేనా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. కానీ, చంద్రబాబుకి ఇది నిజంగానే చారిత్రక అవసరం. ఈ నేపథ్యంలోనే, 50 శాతం సీట్లను వదులుకోవడానికీ చంద్రబాబు సిద్ధంగా వున్నారట.