చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుంటే కోవిడ్ వచ్చేదే కాదు.! తెలుసా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా కోవిడ్ బారిన పడ్డారు. అసలు దేశంలో ఎవరు కోవిడ్ బారిన పడలేదని.? ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కోవిడ్ బారిన పడే వుంటారు. అధికారిక గణాంకాలు వేరు, అనధికారిక వాస్తవాలు వేరు. కోవిడ్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు.

ఎందుకిలా జరిగింది.? ప్రపంచమెందుకు కోవిడ్ కారణంగా వణికింది.? కారణం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లేకపోవడమో. ఒకవేళ చంద్రబాబు గనుక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వుండి వుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోవిడ్ వచ్చి వుండేది కాదు. అసలు ప్రపంచమే కోవిడ్ దెబ్బకి విలవిల్లాడేది కాదు. ఔను, ముమ్మాటికీ ఇది నిజం. నమ్మలేకపోతున్నారా.? ఓ సారి గట్టిగా గిల్లి చూసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసితో చంద్రబాబు రాజకీయ పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అలాంటి పర్యటనల్లో వదిలిన ఓ ఆణిముత్యం ఇది. ‘నేనే గనుక ముఖ్యమంత్రిగా వుండి వుంటే కోవిడ్ వచ్చేదా తమ్ముళ్ళూ.?’ అంటూ చంద్రబాబు ప్రశ్నించేసరికి తెలుగు తమ్ముళ్ళకు మైంబ్ బ్లాంక్ అయిపోయింది.

ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి తొమ్మిదేళ్ళు, పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు. అలాంటి చంద్రబాబు ఇలాంటి సిల్లీ వ్యాఖ్యలెలా చేస్తారు.? అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే దోమల మీద దండయాత్ర చేశారు. సో, ఆయన్నుంచి ఇలాంటి ఆణిముత్యాలు రావడంలో వింతేమీ లేదు.