గుంటూరు కి చంద్ర‌బాబు..అచ్చెన్న ఆరోగ్యానికేమైంది?

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉంది? తీవ్రమైన విరేచ‌నాల‌తో ఇంకా బాధ‌ప‌డుతున్నారా? షుగ‌ర్ లెవ‌ల్స్ అంత‌కంత‌కు ప‌డిపోయాయా? కొత్త‌గా జ్వ‌రం కూడా వ‌చ్చిందా? ఈ కార‌ణాలుగానే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హుటాహుటిన గుంటూరుకు బ‌య‌లు దేరి వెళ్లారా? అంటే అవున‌నే స‌మాచారం అందుతోంది. ఇటీవ‌లే అచ్చెన్న ఈఎస్ కుంభ‌కోణంలో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల పాటు ఏసీబీ అధికారుల విచార‌ణ కూడా పూర్త‌యింది. శ‌నివార‌మే విచ‌రాణ పూర్త‌యింద‌ని దాదాపు 12 గంట‌ల‌పాటు అధికారులు విచారించిన అనంత‌రం గాయం కూడా త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించారు.

అయితే తీవ్ర‌మైన విరేచ‌నాలు, షుగ‌ర్ లెవ్స్ల్స్ ప‌డిపోయిన‌ట్లు అదే రోజు వైద్యులు తెలిపారు. అయినా డిశ్చార్జ్ అయ్యే అవ‌కాశం  ఉంద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. అయితే తాజాగా గుంటూరు జీజీహెచ్ ని క‌రోనా ఒణికిస్తోంది. అదే ఆసుప‌త్రిలో ముగ్గ‌రు వైద్యులు, ఇద్ద‌రు సిబ్బంది, అలాగే వైద్యం కోసం వ‌చ్చిన త‌ల్లీకూతురుకు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఇక అక్క‌డ వైద్యం పొందుతున్న అచ్చెన్న ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు టీడీపీ పెద్ద‌లు ఆరా తీస్తున్నారు. అయితే తాజాగా అచ్చెన్న పైల్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోన్న నేప‌థ్యంలో బీపీ, షుగ‌ర్ లెవ‌ల్స్ పడిపోయాయ‌ట‌. విరేచ‌నాల తీవ్ర‌త కూడా పెరిగిందిట, అలాగే జ్వ‌రం కూడా వ‌స్తోంద‌ని తెలిసింది.

దీంతో ఆరోగ్యం విష‌మించే అవకాశం ఉంద‌ని డాక్ట‌ర్లు సూచించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు కొద్ది సేప‌టి క్రిత‌మే హుటాహుటిన గుంటూరుకు బ‌య‌ల్దేరిన‌ట్లు పార్టీ వ‌ర్గాల నుంచి లీకైంది. అచ్చెన్న‌ను మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డం కోస‌మే చంద్ర‌బాబు బ‌య‌ల్దేరిన‌ట్లు లీకుంద‌తున్నాయి. అచ్చెన్న కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌తో పాటే ఉన్నారు. తాజా ప్ర‌చారంతో టీడీపీ నేత‌ల్లో అచ్చెన్న ఆరోగ్యంపై టెన్ష‌న్ మొద‌లైంది.