చంద్రబాబు ఏడుపు.. రోజా మాత్రం చాలా హ్యాపీ.!

 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెక్కి వెక్కి ఏడవడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావుని చివరి రోజుల్లో ఏడిపించిన చంద్రబాబు ఈ రోజు అందుకు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తోందని రోజా ఎద్దేవా చేయడం గమనార్హం.

‘మీరు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అప్పట్లో నేను ఎమ్మెల్యేగా విపక్షంలో వుంటే.. నా మీద ఎన్నెన్ని రకాల దూషణలకు దిగారో మీకు గుర్తు లేదా.? అప్పుడు మా కుటుంబ సభ్యుల కలత చెందారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని మీరెంతలా దూషించారో ప్రజలందరికీ గుర్తుంది..’ అంటూ రోజా వ్యాఖ్యానించారు.

నిజమే, రోజా కంటే ఎక్కువగా చంద్రబాబు వల్ల నష్టపోయిన మహిళా నాయకురాలు ఇంకెవరుంటారు.? చంద్రబాబు హయాంలో వైసీపీ ఎమ్మెల్యే అయిన రోజా మీద అసెంబ్లీ సాక్షిగా అత్యంత దారుణమైన దూషణలు జరిగాయి. దానికి రోజా కూడా అప్పట్లో బాగానే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

అయితే, రోజాని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంతోపాటు, పలు పలు రకాలుగా వేధింపులకు గురి చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అందుకేనేమో, రోజా ఇప్పుడు ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు. అయితే, రాజకీయాల్లో దెబ్బకి దెబ్బ అనడం సబబు కాదు. వ్యవస్థలు విలువల్ని కోల్పోతున్నాయన్న విషయాన్ని ఆ వ్యవస్థల్లో వున్న ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.

ఇప్పుడు వైసీపీ అధికారంలో వుంది గనుక ఇలా.. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఒకవేళ చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే.. అప్పుడు ఆయన కూడా బదులు తీర్చుకుంటే.? అప్పుడు మరింత దిగజారుడుతనం కనిపించబోతోందని సరిపెట్టుకోగలమా.?