BJP : ప్రత్యేక హోదా ఇవ్వరట.. చీప్ లిక్కర్ అయితే ఇస్తారట.!

BJP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ అమ్ముల పొదిలో వున్న ఒకే ఒక్క అస్త్రం చీప్ లిక్కర్ అని అనుకోవచ్చా.? ఏపీ బీజేపీ గనుక ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టదలచుకుంటే, కేంద్ర బీజేపీ అందుకు సుముఖత వ్యక్తం చేస్తుందా.?

ఏపీ రాజకీయాల్లో నడుస్తోన్న హాటు హాటు చర్చ ఇది. ప్రజల్ని పూర్తిగా మత్తులోకి నెట్టేస్తే, కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయాల్సిన పనిలేదని బహుశా కమలనాథులు భావిస్తున్నారేమో. ప్రత్యేక హోదా ఎగ్గొట్టేశారు. రాజధాని బాధ్యతను విస్మరించారు. పోలవరం ప్రాజెక్టుకి కొర్రీలు పెడుతున్నారు. రైల్వే జోన్ లేదు. దుగరాపట్నం పోర్టూ లేదు, కడప స్టీలు ప్లాంటూ లేదు. కానీ, తక్కువ ధరకే చీప్ లిక్కర్ అందిస్తామంటూ బీజేపీ తమ ఎన్నికల నినాదంతో జనం ముందుకొచ్చేసింది.

ఎవరన్నా నవ్వుకుంటారనిగానీ, అసహ్యించుకుంటారనిగానీ కనీస ఇంగితం లేకుండా ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ‘చీప్ లిక్కర్’ ప్రకటన చేసేశారు. ఈ విషయమై బీజేపీలోనే అంతర్మథనం కనిపిస్తోంది. ‘ఇదెక్కడి వింత.?’ అంటూ బీజేపీ నేతలు చాలామంది వాపోతున్నారు.

ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అయితే, ఈ చీప్ లిక్కర్ ప్రకటనపై ఎలా స్పందించాలో తెలియక తలపట్టుక్కూర్చున్నారు. మరీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత చులకనైపోయారా.? అన్న భావన సోము వీర్రాజు ప్రకటన తర్వాత అందరిలోనూ వ్యక్తమవుతోంది.

ఇంతకీ, సోము వీర్రాజు ప్రకటన పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడెలా స్పందిస్తారో వేచి చూడాలి.