తెలుగు రాష్ట్రాల్లో బలపడాలనే కోరికతో భారతీయ జనతా పార్టీ ఏవేవో చేస్తోంది. ఏపీలో దేవాలయాల మీద దాడులకు మతం రంగు రుద్దే ప్రయత్నంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణలో కేసీఆర్ మీద ఛాడీలు చెప్పుకుంటూ తిరుగుతొంది. కేసీఆర్ మొదటి నుండి కేంద్రంలో బీజేపీ తీసుకుంటున్న చాలా నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా విద్యుత్ చట్టం, వ్యవసాయ బిల్లు ఇలా బీజేపీ కీలకంగా భావించిన రెండు నిర్ణయాలను కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. విద్యుత్ బిల్లు విషయంలో అయితే మోటార్లకు మీటర్లు బిగించె ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఆయన వ్యవసాయ బిల్లును వ్యతిరేకించారు. ఇది ప్రైవేట్ శక్తులకు అనుకూలమని, రైతాంగానికి అన్యాయమని అంటూ బిల్లును తేనెపూసిన కత్తితో పోల్చారు.
దీంతో బీజేపీకి చిర్రెత్తుకొచ్చింది. అందుకే తెరాస మీద ఎవ్వరూ చేయని, చేయలేని విమర్శ ఒకటి చేసింది. అదే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారనే నింద. అవును కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం ఉండబట్టే తమ బిల్లులన్నింటినీ కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. దీన్ని విన్న చాలామంది మరీ ఇంత దారుణమైన జోక్ ఎలా చెప్పగలిగారు. పిల్లలు చెప్పినట్టే ఉంది అంటున్నారు. అసలు కాంగ్రెస్, తెరాసలు బద్ద విరుద్ధమైన పార్టీలు. తెలంగాణలో అవి రెండూ ఎలా పోట్లాడుకుంటుంటాయో అందరికీ తెలుసు. అసలు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే తెరాసకు రాజకీయం అవసరమే ఉండదు.
అవతల కాంగ్రెస్ ఉంది కాబట్టే కేసీఆర్ బలంగా ఉండగలుగుతున్నారు. అలాంటిది వారితోనే కలిస్తే కేసీఆర్ ఉనికికే ప్రమాదం. అయినా బీజేపీ బిల్లులను ఎవరు వ్యతిరేకించిన వారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారాణి బీజేపీ నేతలు ఎలా అంటున్నారో అర్థముకావట్లేదు. బీజేపీ మిత్ర పక్షాలే ఆ బిల్లును వద్దంటున్నాయి. అప్పుడు వారంతా కాంగ్రెస్ పార్టీతో కలిసినట్టేనని అంటే సబబేనా.. కాదు కదా. దేశంలో అటు బీజేపీ,ఇటు కాంగ్రెస్ పార్టీ రెంటినీ వ్యతిరేకించే పార్టీలు చాలా ఉన్నాయి. వాటిలో తెరాస కూడ ఒకటి. గతంలో మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నచ్చింది కాబట్టి కేసీఆర్ సపోర్ట్ చేశారు. ఇప్పుడు వ్యవసాయ బిల్లు నచ్చలేదు కాబట్టి వ్యతిరేకించారు. అది వారి హక్కు. దానికే ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని బీజేపీ అనడం నిజంగా హాస్యాస్పదం.