ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జూన్ , జూలై నుంచి క్రమంగా పెరిగే వర్షాల వల్ల మలేరియా, డెంగీ జ్వరాలతో పాటు, స్వైన్ ఫ్లూ , గన్యా, టైపాయిడ్, కామెర్లు, డయేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్లూ జ్వరాలు పంజా విసిరితే చుట్ట బెట్టేస్తాయి. పలు వ్యాధులకు దగ్గు, జలుబు, ప్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్ కూడా కొన్ని లక్షణాలు అవే ఉండటంతో ప్రజల్లో ఏది కరోనా? ఏది ప్లూ జ్వరమో తెలియక ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ రంగంలోకి దిగింది.
లాక్ డౌన్ ఆంక్షలు సడలించినందున రానున్న సెప్టెంబర్ వరకూ పెరిగే కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ తగిన చర్యలకు సిద్దమవుతోంది. నేటి నుంచి ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఈ సమయంలో కొవిడ్ అనుమానిత లక్షణాలు గురించి కాకుండా… ముందుగా సీజనల్ గా వచ్చే ఇతర వ్యాధులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అవగాహ కల్పించనున్నారు. గతేడాది డెంగీ, మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. తాగునీరు కలుషితం కాకుండా సరఫరా పైపు లైన్లు మరమ్మత్తు విషయంలో పంచాయతీ, పురపాలక సిబ్బంది అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే మొదలు పెట్టాలని అధికారలు ఆదేశించారు.
దీనిలో భాగంగా గతేడాది ప్లూ జ్వరాలు విశాఖ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా నమోదయ్యాయి. అధికారులు అక్కడ ప్రత్యకంగా దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటారు. అలాగే కరోనా వ్యాప్తి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గ చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రజలంతా మహమ్మారితో పోరాడుతున్నారు. ఈ మహమ్మారికి సీజనల్ జ్వరాలు కలిస్తే పరిస్థితి ఏంటి? అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.