ఏపీ స్పీకర్‌ పై మీ పద్దతి మార్చుకోండని హైకోర్టు సీరియస్ కామెంట్స్.. ?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఇది వరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే.. ఆయన గత కొన్ని నెలల క్రితం ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం తగదని, కోర్టులు ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అంటూ కామెంట్ చేశారు.. ఈ విషయం పై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు కేసు వేసి, స్పీకర్ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని ఆ పిటిషన్ లో ప్రస్తావించారు.

ఈ సంఘటన పై విచారణ జరిపిన హైకోర్టు తమ్మినేని సీతారాంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది.. సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు, స్పీకర్‌ తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ధర్మాసనం స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించాయని, ఆ మాటలను కోర్టులపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.. అదీగాక హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలని, కానీ అలా చేయకుండా కోర్టు తీర్పులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం.. ఇలాంటి వారికి తగదంటూ, మీ పద్దతి మార్చుకోవలసి ఉంటుందని హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది..

ఇక స్పీకర్‌తోపాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేష్‌, విజయసాయిరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌ సహా వైసీపీ నేతలు సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలపైనా హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించగా, హైకోర్టు తరపున న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో వీరు చేసిన వాఖ్యలను చూస్తుంటే న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.. ఇకపోతే ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్న అధికారులు, న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై కామెంట్స్ చేస్తే మాత్రం పదవిలో ఉన్న వాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. నేతలను రక్షించేందుకు మీరు కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.. అదీగాక ఏదైన కేసులో సీఐడీ విఫలమయితే ఆ కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.