Y.S.Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన నేపథ్యంలో వైయస్ షర్మిల మోడీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం.. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని స్పష్టం చేశారు.
కొత్త రాజధాని నిర్మాణంలో మౌలిక పరిస్థితుల్లో సదుపాయాలను కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని అన్నారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి ఇచ్చింది ఏంటి అంటూ ఈమె ప్రశ్నించారు. 2015 వ సంవత్సరంలో అమరావతికి వచ్చే శంకుస్థాపన చేసి అప్పుడు మట్టి కొట్టారని ఇప్పుడు మాత్రం సున్నం కొట్టి వెళ్లారు అంటూ ప్రధానమంత్రి పై సెటైర్లు వేశారు.
పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఏం చెప్పి మోసం చేశారో సరిగా ఇప్పుడు కూడా అలాంటి అందమైన అబద్ధాలను చెప్పి మోసం చేస్తున్నారని తెలిపారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ఇంతవరకు ఎందుకు కాలేదు..? అమరావతి నిర్మాణానికి ఖర్చయ్యే లక్ష కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి మోడీనీ నమ్మి మళ్ళీ మళ్ళీ మోసపోవుతున్నారని షర్మిల తెలిపారు.ఏదో ఉద్ధరిస్తారని, కాసులు కురిపిస్తారని నమ్మి.. ఒకసారి రాత్రి గోతిలో పడ్డ చంద్రబాబు గారు.. మళ్లీ మోడీని పిలిచి అదే గోతిలో పడ్డారు. రాజధానికి కావాల్సింది అప్పులు కాదు నిధులు కావాలని ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు ఉన్న మన రాష్ట్రానికి అప్పు తెస్తే తప్ప జీతాలు అందని పరిస్థితులలో ఉన్నారు మరి అలాంటప్పుడు ఎవరిని అడిగి 60 వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు అంటూ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి అప్పు తేవాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వ ఆస్తులు అంటే అదంతా కూడా ప్రజల సొమ్మే కదా అంటూ చంద్రబాబు నాయుడు తీరుపై ప్రధానమంత్రి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.