రామాయణంలో సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు. కానీ ఏపీలో ఇప్పుడు సీత కష్టాలు, పీత కష్టాలు కూడా కూటమి ప్రభుత్వమే భరించాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు.
అందుకు ప్రధాన కారణం.. కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండా అమరావతే అని చంద్రబాబు చెప్పుకొవడం.. కానీ, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు వస్తున్నట్లు కనిపించకపోవడం. తాజాగా సీఆర్డీయే పరిధిలోనే మావిగన్ అంశాన్ని జగన్ తెరపైకి తేవడంతో… ఇప్పుడు అన్ని కష్టాలు బాబుకే అన్నట్లుగా మారింది పరిస్థితి.
ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు ఆశలన్నీ అమరావతి, పోలవరం పైనే ఉన్నాయని చెబుతోన్న సంగతి తెలిసిందే. అందుకే విభజిత ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు చెప్పిన మాట… ‘ఏ’ అంటే అమరావతి, ‘పీ’ అంటే పోలవరం అని.
ఆ విధంగా ఆయన ఏపీకి తనదైన అబ్రివేషన్ చెప్పారు. అయితే… 2009 – 14 మధ్య చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి అనే విషయంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా తాత్కాలిక భవనాల పేరు చెప్పి వేల కోట్ల ప్రజాధనం నాశనం చేశారనే విమర్శలు బలంగా వినిపించాయి. ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో జగన్ చేసిన కొన్ని స్వయంకృతాపరాధాల ఫలితంగా 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యారు.
ఈ సమయంలో ఈ రెండేళ్లలో సాధించింది ఏమిటయ్యా అంటే… అమరావతికి చట్టబద్ధత కల్పించడం. ఇది రైతులను ఏమార్చడానికి పనికి వస్తుందే తప్ప.. అమరావతి అభివృద్ధికి మాత్రం ఏమీ ప్రయోజనం లేదనేది పరిశీలకులు చెబుతోన్న మాట.
దీంతో… రాబోయే మూడేళ్లలో కూడా ఏపీకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు చాలా స్వల్పమని.. అమరావతి సంగతైతే చెప్పే పనే లేదని.. పైగా మరో 50వేల ఎకరాలంటూ చంద్రబాబు చేస్తోన్న పనులు ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బీన్ తుగ్లక్ మాదిరి కనిపిస్తున్నాయని.. ఈ తరహా ఆలోచనలు చరిత్రహీనులుగా మిగిలిపోయే వారికే ఎక్కువగా వస్తుంటాయని కథనాలు వస్తున్న పరిస్థితి.
ఈ సమయంలో టీడీపీ నేతలకు సమాధానాలు చెప్పే సబ్జెక్ట్ లేకో, ఆ సమాధానాలు సహేతుకంగా లేవనే విషయం ప్రజలు గ్రహిస్తారనో, అదీగాక.. మావిగన్ వద్దు అమరావతి మాత్రమే ముద్దు అంటే జనం ఏమనుకుంటారనో ఆందోళనలో భాగంగానో ఓ సరికొత్త ప్రయత్నం షురూ చేశారు.
అదే మావిగన్ పేరు చెప్పి జగన్ పై అడ్డగోలుగా ట్రోల్స్ చేయడం. ప్రస్తుతం ఏపీలో టీడీపీ జనాలు చేస్తున్నది ఇదే.
వాస్తవానికి మావిగన్ ప్రకటన తరువాత అమరావతి రాజధాని నిర్మాణం ఫైనాన్షియల్ వయబులిటీని మావిగన్ తో పోల్చుతూ అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల్లో చర్చ మొదలైంది.
ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి, అటు బాపట్ల వరకూ వేగంగా పాకిందని అంటున్నారు. పైగా మావిగన్ కు కూటమి ప్రభుత్వంలోనే నేతలే వారి వారి నియోజకవర్గ ప్రజానికంతో సానుకూలంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.
దీంతో… ఈ విషయం టీడీపీ సోషల్ మీడియా జనాలకు తెలియకో.. లేక, అధినేతలకు అర్ధం కాకో.. మునిగిపోతున్న పడవలోకి నీళ్లు వస్తున్నాయనే విషయం కనిపించకో తెలియదు కానీ… అమరావతి ఇప్పట్లో పూర్తిగా సాధ్యం కాదు అని జగన్ చేసిన వ్యాఖ్యలకు అర్ధవంతమైన వివరణ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న టీడీపీ నేతలు.. పూర్తిగా అడ్డగోలు ట్రోల్స్ తోనే కాలం గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే… టీడీపీ కష్టం పగవాడికి కూడా రావొద్దు గురువు గారూ అంటూ అదుర్స్ మూవీలో డైలాగ్ తో రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్లు.
